సుబేదారి, నవంబర్ 15: క్రెడిట్ కార్డు కోసం బ్యాంకులో సంతకం పెట్టి వచ్చేసరికి కారులో ఉంచిన రూ.25 లక్షల నగదును అపహరించిన ఘటన సోమవారం హనుమకొండలో చోటుచేసుకున్నది. జనసంచారంతో బిజీబిజీగా ఉండే ప్రాంతంలో రోడ్డుపై నిలిపిన కారు అద్దాలు పగులగొట్టి మరీ డబ్బును అపహరించడం నగరంలో కలకలం సృష్టించింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో బాధితులు, పోలీసులు నివ్వెరపోయా రు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జులైవాడ ప్రకాశ్రెడ్డిపేటకు చెందిన కొండబత్తుల తిరుపతి ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్కు సోమవారం రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉంది.
ఇందుకోసం కొడుకులు సాయితేజ, కృష్ణవంశీతో కలిసి మధ్యా హ్నం రెండు బ్యాంకుల్లోని ఖాతాల నుంచి డబ్బు లు డ్రా చేయడానికి కారులో బయలుదేరారు. మొదట హంటర్రోడ్డులోని ఎస్బీఐలో కృష్ణవంశీ తన ఖాతానుంచి రూ.5 లక్షలు డ్రాచేసి తండ్రికి అప్పగించి ఇంటికి వెళ్లాడు. అనంతరం సాయితేజతో కలిసి నక్కలగుట్టలోని హెచ్డీఎఫ్సీ బ్యాం కుకు వచ్చారు. బ్యాంకు పక్కనే కారు పార్క్ చేసి ఇద్దరు బ్యాంకులోకి వెళ్లారు. వేర్వేరు ఖాతాల్లోంచి రూ.20 లక్షలు డ్రా చేశారు. మొత్తం 25 లక్షలతో సాయితేజ కారు వద్దకు వచ్చాడు.
ఇంతలో బ్యాం కు నుంచి క్రెడిట్ కార్డు కోసం ఫోన్ రావడంతో నగదును కారులోనే పెట్టి డోర్లాక్ చేసిన సాయితేజ తిరిగి బ్యాంకులోకి వెళ్లాడు. 10 నిమిషాల వ్యవధిలోనే తండ్రీకొడుకు కారు వద్దకు వచ్చారు. కారు అద్దాలు పగులగొట్టి, రూ.25 లక్షలు చోరీ చేసినట్టు గుర్తించారు. ఆందోళనకు గురైన బాధి తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, సుబేదారి సీఐ రాఘవేందర్, క్లూస్ టీం ఘటన స్థలానికి చేరుకుంది. పగిలి ఉన్న కారు అద్దాలు, సీట్లో వేలిముద్రలను సేకరించారు. కారు నుంచి 30 ఏళ్ల యువకుడు డబ్బులను ఎత్తుకెళ్లిన దృశ్యాలు పక్కనే షాపింగ్ కాంప్లెక్స్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగ హంటర్రోడ్డు ఎస్బీఐ నుంచే ఫాలో అయ్యాడా, పాతనేరస్తుడా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.