న్యూఢిల్లీ, నవంబర్ 9: ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) చార్జింగ్ స్టేషన్లపై దృష్టి సారించాయి. 2070 నాటికి శూన్యస్థాయి ఉద్గారాల లక్ష్య సాధనే ధ్యేయంగా వచ్చే 3-5 ఏండ్లలో దేశవ్యాప్తంగా 22,000 ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) గరిష్ఠంగా 10,000 ఔట్లెట్లను తీసుకురాబోతున్నదని ఆ సంస్థ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. ఇక భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) 7,000 స్టేషన్లను ఏర్పాటు చేయనుందని సంస్థ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ వెల్లడించారు. అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) 5,000 చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తేనున్నది.
ఏడాదిలో 4వేల స్టేషన్లు
వచ్చే ఏడాది కాలంలో ఐవోసీ 2,000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుందని, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలు సైతం 1,000 చొప్పున తెస్తాయని మంగళవారం చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. ఐవోసీ ఇప్పటికే 439 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, బీపీసీఎల్ 52, హెచ్పీసీఎల్ 382 ఈవీ స్టేషన్లను నెలకొల్పాయి. ప్రతీ 25 కిలోమీటర్లకు ఓ 50 కిలోవాట్ల చార్జింగ్ స్టేషన్ను, భారీ వాహనాలకు అనువుగా ప్రతీ 100 కిలోమీటర్లకు ఓ 100 కిలోవాట్ల చార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని ఐవోసీ యోచిస్తున్నది. ఇప్పటికే ఉన్న, కొత్తగా వచ్చే పెట్రోల్ బంకుల వద్ద ఈ చార్జింగ్ స్టేషన్లను నిర్మించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్-బ్రిటీష్ పెట్రోలియం జాయింట్ వెంచర్ సైతం చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. పెట్రో ధరలు సెంచరీలు దాటిన నేపథ్యంలో అంతా ఇప్పుడు విద్యుత్తు ఆధారిత వాహనాల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. దీంతో చమురు కంపెనీలు అదే బాటలో వెళ్తున్నాయి.