హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) భూసేకరణ అభ్యంతరాల స్వీకరణకు కేంద్రం 21 రోజులు గడువు ఇచ్చింది. అభ్యంతరాల స్వీకరణకు గెజిట్ విడుదలైన తేదీ నుంచి పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలిపింది. ఈ మేరకు విడుదలైన గెజిట్లను ఒక తెలుగు, ఒక ఇంగ్లిష్ పత్రికకు ప్రకటనల ద్వారా విడుదల చేసింది.
ట్రిపుల్ఆర్ భూసేకరణకు 8 యూనిట్లను ఖరారు చేస్తూ స్మాల్ ఏ గెజిట్ విడుదల చేసిన కేంద్రం, తాజాగా భూసేకరణ కోసం సర్వే నంబర్లవారీగా వివరాలు తెలియజేస్తూ భూసేకరణ యూనిట్లవారీగా క్యాపిటల్ ఏ గెజిట్లు విడుదల చేస్తున్నది. ఇందులో భాగంగా మొదటి విడతగా 2 భూసేకరణ యూనిట్ల పరిధిలోని భూముల వివరాల తో రెండు గెజిట్లను విడుదలచేసింది. మరో 6 గెజిట్లను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన భూసేకరణ యూనిట్ పరిధిలోని గ్రామాల్లో సర్వే నంబర్లవారీగా భూముల వివరాలను తెలియజేస్తూ గెజిట్ను విడుదలచేసింది.
ఇందులో గ్రామాలు, సర్వే నంబర్లవారీగా ఎంత భూమిని సేకరించాలని నిర్ణయించారో తెలియజేసింది. అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన భూసేకరణ యూనిట్ పరిధిలో 2,086,089.8800 చదరపు మీటర్లకు చెం దిన 208.6090 హెక్టార్ల భూమిని సేకరించాలని నిర్ణయించింది. దీనిపై భూ యజమానులతోపాటు ఇతరు ల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలను ప్రజలు భూసేకరణ అధికారికి తెలియజేయాలని కేం ద్రం పేర్కొన్నది.
జోగిపేట-అందోల్ ఆర్డీవో నేతృత్వం లోని భూసేకరణ యూనిట్లో 1,089,490.6600 చదరపు మీటర్లకు చెందిన 108.9491 హెక్టార్ల భూమిని సేకరించాలని నిర్ణయించినట్టు గెజిట్లో పేర్కొన్నది. దీనిపై అభ్యంతరాలను జోగిపేట- అందోల్ ఆర్డీవో కు 21 రోజులో తెలియజేయాలని గెజిట్లో స్పష్టంచేసింది. అభ్యంతరాలపై సమాధానాలు ఇచ్చిన తరువాత ఆ ప్రాంతాల్లో రోడ్డుకు మార్కింగ్ చేస్తారు. ఆ తరువాత భూసేకరణ పనులు మొదలు పెట్టడానికి మరో గెజిట్ విడుదలచేస్తారు. ఆపై పరిహారానికి సంబంధించిన గెజిట్ విడుదల కానున్నది.