దాహోద్ (గుజరాత్), నవంబర్ 20: గుజరాత్లోని దాహోద్ పట్టణానికి చెందిన ఒక మహిళ కరోనాతో ఏకంగా 202 రోజులు పోరాడి విజయవంతంగా కోలుకొని తిరిగి ఇంటికి చేరారు. దాదాపు ఏడు నెలల పాటు ఆమెకు వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. ఈ సమయంలో తొమ్మిదిసార్లు ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించింది. కోలుకొని తిరిగి ప్రాణాలతో బయటకు వస్తుందన్న ఆశ కూడా వదులుకున్నారు. ఒకానొక సమయంలో ఊపిరితిత్తుల మార్పిడి కూడా చేయాలన్నారు. ఇటువంటి నేపథ్యంలో కరోనాపై విజయవంతంగా పోరాడి ఆ మహిళ ఇంటికి చేరుకోవడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దాహోద్ పట్టణానికి చెందిన ఒక రైల్వే ఉద్యోగి భార్య అయిన గీతా ధార్మిక్.. ఒక కార్యక్రమం నిమిత్తం భోపాల్కు వెళ్లగా కరోనా సోకింది. దాహోద్ రైల్వే దవాఖాన, వడోదరలోని ఒక ప్రైవేటు దవాఖానలో ఆక్సిజన్ సపోర్టుతో వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఎట్టకేలకు వైద్యుల చికిత్స, ఆక్సిజన్ థెరపీతో కోలుకున్న గీతా ధార్మిక్ శుక్రవారం దాహోద్ రైల్వే దవాఖాన నుంచి ఇంటికి చేరుకున్నారు.