హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రోజుకు 2 లక్షల సైబర్ దాడులు జరిగినట్టు ప్రముఖ సైబర్ భద్రత కంపెనీ నార్టన్ పేర్కొన్నది. గత మూడు నెలల్లోనే దేశవ్యాప్తంగా 1,80,13,055 బెదిరింపులు, 59,907 ఫిషింగ్ స్కామ్లు, 31,062 టెక్ సపోర్ట్ స్కామ్లు గుర్తించినట్టు తెలిపింది. నార్టన్ లైఫ్ లాక్కు చెందిన పరిశోధన బృందం ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి సైబర్ సేఫ్టీ పల్స్ నివేదికను బుధవారం విడుదల చేసింది.
ఈ నివేదికలో.. సైబర్ నేరగాళ్లు వినియోగదారులను మోసం చేయటానికి డీప్ ఫేక్ (డిజిటల్ ద్వారా ముఖాన్ని ఇతరుల రూపంలో మార్చుకొని సంభాషించే వీడియోలు) విధానాన్ని వినియోగిస్తున్నారని తెలిపింది. ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్, చారిటీ స్కామ్లు, ఇతర మోసపూరిత కుయుక్తుల కోసం డీప్ ఫేక్ను ఉపయోగించినట్టు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ మూడు నెలల్లో 100 కోట్ల సైబర్ దాడులు (రోజుకు 1.1 కోట్ల దాడులు) జరిగాయని వివరించింది.
1.6 కోట్ల ఫిషింగ్ స్కామ్లు చేసినట్టు తెలిపింది. క్రిప్టో కరెన్సీ చెల్లింపుల్లోనూ ఫిషింగ్ స్కామ్లు జరిగాయని, 2021లో రూ.221 కోట్ల విలువైన బిట్కాయిన్లు చోరీ చేశారని వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు కొత్త వ్యూహాలతో దాడులకు పాల్పడుతున్నారని, అప్రమత్తంగా ఉంటేనే వారి దాడులను తప్పించుకోవచ్చని నార్టన్ లైఫ్ లాక్ టెక్నాలజీ హెడ్ డారెన్ షౌ పేర్కొన్నారు.