నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 28: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విమానగోపురానికి స్వర్ణతాపడం కోసం గురువారం ఒక్కరోజే పలువురు దాతలు రూ.2 కోట్ల 45 లక్షల మేర విరాళాలు అందజేసినట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. ఇందులో మంత్రి మల్లారెడ్డి కుటుంబసభ్యులు, మేడ్చల్ నియోజకవర్గం తరుపున రూ.1.82 కోట్లు, జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ అధినేత జడపల్లి నారాయణగౌడ్ రూ.50 లక్షలు, విశ్రాంత వేదపండితులు, జీవీఆర్ఎస్ ఘనాపాటి కుటుంబసభ్యులు లక్షా ఎనిమిది రూపాయలు అందజేశారని వివరించారు. వీరితోపాటు మరికొంత మంది విరాళాలు అందజేయగా మొత్తంగా రూ.2,45,52,436 సమకూరిందని చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తొలుత రెండున్నర కేజీల బంగారం సమర్పించుకోవాలని భావించినప్పటికీ, ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల సహకారంతో మూడున్నర కేజీల బంగారానికి సమానమైన విరాళాలు సమకూరాయని చెప్పారు. విరాళాల సమర్పణతో తన జన్మధన్యమైందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి, బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.