అమరావతి: కొర్రుప్ప ఘటనలో 16 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కప్పర్రులో టీడీపీ నాయకురాలి ఇంటిపై సోమవారం అర్ధరాత్రి దాడి జరిగింది. గణపతి నిమజ్జనాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో టీడీపీ మాజీ జడ్పీటీసీ బత్తిని శారద ఇంటి వద్దకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఆమె ఇంటిపై రాళ్లతో దాడి చేశారు.
అంతేకాకుండా ఇంట్లోకి దూరి సామగ్రిని ధ్వంసం చేశారు. సామగ్రితో పాటు ఆరు ద్విచక్ర వాహనాలకు పెట్రోలు పోసి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో నిందితులను పట్టుకోవడానికి బాపట్ల డీఎస్పీ ఆధ్వర్యంలో బాపట్ల సీఐ, పొన్నూరు రూరల్, పట్టణ సీఐలతో మూడు బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఘటనపై విచారణ జరిపి, ఆధారాలు సేకరిస్తున్నామని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.