న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ విస్తరణ కొనసాగుతూనే ఉన్నది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దేశంలోనూ ఒమిక్రాన్ వేరియంట్ విస్తరణ శరవేగంగా సాగుతున్నది. అయితే ఒమిక్రాన్ విస్తరణ వేగంగా ఉన్నా.. మరణాలు ప్రమాదకర స్థాయిలో లేకపోవడం సంతోషకరమైన విషయం. ఇప్పటివరకు కొత్త వేరియంట్ కేసులు లక్షలు దాటినా మరణాలు మాత్రం 115 మాత్రమే సంభవించాయి.
దేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు భారీగానే ఉన్నాయి. కానీ, మరణాల విషయానికి వస్తే కేవలం ఒక్క మరణం మాత్రమే నమోదైంది. ఈ వివరాలను భారత వైద్యారోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ డాటా ప్రకారం.. డెల్టా వేరియంట్తో పోల్చుకుంటే ఒమిక్రాన్ వేరియంట్తో హాస్పిటలైజ్ అయ్యే ప్రమాదం చాలా తక్కువగా ఉందని చెప్పారు. దక్షిణాఫ్రికా, యూకే, కెనడా, డెన్మార్క్ దేశాల్లో కేసుల ఆధారంగా డబ్ల్యూహెచ్వో ఈ డాటాను వెల్లడించింది.
దేశంలో థర్డ్వేవ్ వేగంగా వేగంగా విస్తరిస్తున్నదని లవ్ అగర్వాల్ చెప్పారు. దాంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,55,319కి చేరిందన్నారు. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రభావం తీవ్రంగా ఉన్నదని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో అత్యధికంగా పాజిటివిటీ రేటు నమోదవుతున్నదన్నారు. మహారాష్ట్రలో 22.39 శాతం, బెంగాల్లో 32.18 శాతం, ఢిల్లీలో 23.1 శాతం పాజిటివిటీ రేటు ఉందని చెప్పారు.