బాగ్దాద్: ఒక వాహనం, మినీ బస్సు ఢీకొన్నాయి. రెండు వాహనాలకు మంటలంటున్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది స్కూల్ టీచర్లతోసహా 11 మంది మరణించారు. ఇరాక్లోని బాబిలోన్ ప్రావిన్స్లో శుక్రవారం రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది. షియాల పవిత్ర నగరం కర్బలాలో జరిగిన రంజాన్ విందుకు హాజరైన కొందరు మినీ బస్సులో శుక్రవారం అర్థరాత్రి వేళ తిరిగి వస్తున్నారు. అయితే వ్యతిరేక దిశలో వేగంగా వచ్చిన మరో వాహనం ఆ మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలకు మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో బస్సులోని 9 మంది స్కూల్ టీచర్లతో సహా 11 మంది మరణించినట్లు ఇరాక్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు గాయపడినట్లు చెప్పారు. అతి వేగం, ఇతర వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు.
కాగా, తాము ఇంకా యుద్ధంలోనే ఉన్నామన్న భ్రమలో ఉంటున్నామని ఇరాక్ ట్రాఫిక్ పోలీస్ అధికారి తారెక్ ఇస్మాయిల్ తెలిపారు. పాడై గోతుల మయమైన రహదారులు, రాత్రి వేళ వీధి లైట్లు లేక చీకటిమయం, ట్రాఫిక్ నిబంధనలు పట్టకపోవడం, అతి వేగం, డ్రగ్స్, మద్యం మత్తులో డ్రైవింగ్, మౌళిక సదుపాయాల కొరత, ఘర్షణలు, అవినీతి వంటి వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.