హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అర్హులైన వీధివ్యాపారులకు ప్రభుత్వం 69,315 తెల్ల రేషన్కార్డులను అందించడంతోపాటు అనేక పథకాలను వర్తింపజేసింది. జీహెచ్ఎంసీ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, రామగుండం, ఆదిలాబాద్, ఖమ్మం, సూర్యాపేట పట్టణాల్లోని 1.03 లక్షల మంది వీధివ్యాపారులపై కుటుంబ సర్వే నిర్వహించి ఈ పథకాలను వర్తింపజేసింది. వీధివ్యాపారుల్లో చాలా మందికి అర్హతలున్నప్పటికీ ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారని, వీటి గురించి అవగాహన లేకపోవడం, ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలో తెలియకపోవడం ఇందుకు కారణమని ప్రభుత్వం గుర్తించింది.
ఈ నేపథ్యంలో రిజిస్టర్ చేసుకున్న వీధివ్యాపారుల కుటుంబాలపై మున్సిపల్శాఖ ఆధ్వర్యంలో మెప్మా అధికారులు సర్వే చేశారు. తద్వారా సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వారికి అర్హమైన పథకాలను వర్తింపజేశారు. ప్రధాన మంత్రి జన్ధన్ యోజన కింద 10,686 బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా పథకానికి 1.43 లక్షల మందితో దరఖాస్తు చేయించారు. 1.01లక్షల మందికి ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా పథకాన్ని వర్తింప చేశారు. 60 సంవత్సరాల వయస్సు దాటిన వీధి వ్యాపారులకు ప్రతి నెలా రూ.3 వేల పింఛన్ వచ్చే ప్రధాన మంత్రి శ్రమ్యోగి మన్ధన్ పథకాన్ని 27,051 మందికి వర్తింపజేశారు.