హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అధికారం కోసం అర్రులు చాస్తున్న బీజేపీ.. అందుకు రైతులను అడ్డు పెట్టుకొని కొత్త కుట్రలకు తెరతీస్తున్నది. అధికారమే పరమావధిగా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. తమ అధికారం దాహం తీర్చుకునేందుకు రైతును బలిపీఠంపై ఎక్కించేందుకు గావు కేకలు పెడుతున్నది. రైతులను రోడ్లపైకి తెచ్చి… వారితో ధర్నాలు, రాస్తారోకోలు చేయించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నరు. ఇలా గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో దుర్మార్గపు రాజకీయం నడుస్తున్నది. ఎంతలా అంటే రైతులను నష్టపరిచి, వారిని సంక్షోభంలోకి నెట్టే స్థాయికి అది చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అష్టకష్టాలు పడ్డ తెలంగాణ రైతాంగం.. ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నరు. ఆ సంతోషాన్ని ఆవిరి చేసేలా కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి రైతులపై బాంబు పేల్చింది. ఇకపై యాసంగి సీజన్లో పారా బాయిల్డ్ రైస్ తీసుకునేది లేదంటూ అల్టిమేటం జారీచేసింది. దీంతో తెలంగాణ రైతాంగం మళ్లీ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేయాలి.. రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశపెట్టారు. ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుభీమా, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, రైతు వేదికలు వంటి దేశంలో ఎక్కడా లేని పథకాలను టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టింది. ఈ పథకాల కోసం ఏకంగా రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఈ విధంగా రైతుల జీవితాలను బాగు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని స్థిరీకరిస్తూ పథకాల ద్వారా రైతుల జేబులు నింపే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు విపక్షాలేమో పోలింగ్ డబ్బాలను నింపుకునే కుట్రలు చేస్తున్నాయి. రైతులపై చిత్తశుద్ధి గల ప్రభుత్వం కనుక ఇన్ని పథకాలను అమలు చేసింది. కానీ ఇప్పుడు కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకొని ధాన్యం కొనలేమంటున్నది. కేంద్రం నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ నిస్సహాయ స్థితిలో ఉంది కాబట్టే వరి వేయొద్దని రైతులకు సూచిస్తున్నది. అయితే మిల్లర్లతో, సీడ్ కంపెనీలతో ఒప్పందం ఉంటే వరి వేసుకోవచ్చు. లేని పక్షంలో వరి వేయొద్దు అంటున్నది. ఎందుకంటే ఆ పంటను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పరిస్థితి లేదు.
తెలంగాణ రైతాంగం ఆలోచించే తరుణం ఆసన్నమైంది. మీ మేలు కోరేది ఎవరు? మిమ్మల్ని బలి చేసేది ఎవరో తేల్చుకునే రోజు వచ్చింది. మీకు నష్టం జరుగొద్దని ఆరాటపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మాట వింటారో లేక.. మిమ్మల్ని నట్టేట ముంచే విపక్షాల కుట్రలను నమ్ముతారో తెల్చుకోవాల్సింది మీరే. అయితే మీ మేలు కోరే ప్రభుత్వం మాట వినకుండా.. రెచ్చగొట్టే విపక్షాల మాటలు వింటే దెబ్బతినడం ఖాయం. విపక్షాల మాయమాటలు నమ్మితే రోడ్డుపాలు కావడం ఖాయం. అందుకే తెలంగాణ రైతాంగం క్షేమం కోరి… మీరు విపక్షాల మాటలు నమ్మి వరి వస్తే దెబ్బతింటరని, ఇది రైతుల మిత్రపక్ష ప్రభుత్వం కాబట్టి.. స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వం కాబట్టి.. మీ క్షేమం కోరి వరి సాగు చేయొద్దని సూచిస్తున్నది. తర్వాత తేల్చుకోవాల్సింది మీరే.
రాష్ట్రంలో పండించే ధాన్యాన్ని సేకరించి.. దేశవ్యాప్తంగా ప్రజాపంపిణీ కోసం సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కానీ ఈ బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటున్నది. దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ (రేషన్ బియ్యం)ని నిలిపేసే కుట్రకు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే ఇకపై యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్తున్నది. ఇలా రైతులు పండించే ధాన్యాన్ని చివరగా వినియోగించే కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు కొనుగోలు చేయబోమని అంటున్నది. కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు వద్దని అనాల్సి వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ చట్టాల ప్రకారం రైతులు పండించే పంటలను కేంద్రం కొనుగోలు చేయదు. దీంతో ఎక్కడా కూడా మార్కెట్లు ఉండవు. ఇకపై రైతులు పండించిన ధాన్యాన్ని రైతులే సొంతంగా ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవాల్సి వస్తుంది. ఇదీ కేంద్రం కుట్ర.
ఈ రోజు బండి సంజయ్ మాటలు, ఇంకొకరి మాటలు నమ్మి వరి వేస్తే రేపు కొనుగోలు చేయకపోతే ఎవరు బాధ్యులు? భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రైతులు వరి కాకుండా ఇతర పంటలు సాగు చేసుకోవాలి. మార్కెట్లో పుష్కలంగా డబ్బులొచ్చే అనేక పంటలు ఉండగా కేవలం వరి పంటనే ఎందుకు సాగు చేయాలి? ఎందుకు ఇబ్బందులు కొని తెచ్చుకోవాలి? అమ్ముడుపోయే పంటలు వేసుకొని డబ్బు సంపాదించండి.. అమ్ముడుపోని పంటలు వేసి నష్టపోవద్దని ప్రభుత్వం చెబుతున్నది.
రాష్ట్రంలో ఈ వానకాంలో సుమారు 62 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ వివరాలను సర్వే నంబర్లవారీగా నమోదు చేసి అధికారులు కేంద్రానికి పంపించారు. కానీ కేంద్రం మాత్రం దీనిపై కొర్రీలు పెడుతున్నది. ‘మేం శాటిలైట్ పిక్చర్ ద్వారా చూశాం. మీ రాష్ట్రంలో అంత విస్తీర్ణంలో వరి సాగుకాలేదు’ అని అన్నారు. సరే.. మీరే వచ్చి ప్రత్యేకంగా సర్వే చేసుకోవచ్చని మన రాష్ట్ర అధికారులు చెప్తే సమాధానం లేదు. ఇలా ధాన్యం కొనుగోలు నుంచి తప్పించుకొనేందుకు కేంద్రం కొత్త నాటకాలు అడుతుంది.
గత యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం 93 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించింది. ఇందుకు గానూ ఎఫ్సీఐకి 62 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎఫ్సీఐ మాత్రం కేవలం 24.75 లక్షల టన్నులు మాత్రమే తీసుకుంటామని మొండికేసింది. సీఎం స్వయంగా కల్పించుకొని రెండుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసి మరో 20 లక్షల టన్నులకు ఒప్పించారు. అయినప్పటికీ ఇంకా 5 లక్షల టన్నులు తీసుకోలేదు. అది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉంది. ఇదీ రైతుల పట్ల కేంద్రం చిత్తశుద్ధికి నిదర్శనం.