దుండిగల్, అక్టోబర్ 30: ఏండ్ల తరబడి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న భూ సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మేడ్చల్- మల్కాజిగిరి కలెక్టర్ ఎస్.హరీశ్ను కోరారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని భూ సమస్యలపై లిఖితపూర్వక వినతిపత్రం అందజేశారు. గాజులరామారం పరిధిలో సర్వే నంబర్ 94, 97, 107, 140, 141, 201, 215, 216, 217, 219, 222, 223, 224, 225, 255, 256, 306, 307, 320, 321, 322, 323, 324, 325, 326, 327, 330, 331, 333, 334, 336, 337, 338, 339, 453లలోని వక్ఫ్బోర్డు భూ సమస్యలపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ జయరామ్నగర్ కాలనీ, పద్మానగర్లలో సర్వే నంబర్ 101,105లో ఉంటున్న యమాజనుల స్థలాల్లో డిఫెన్స్ జోక్యం, గాజులరామారంలో ఆక్సిజన్ పార్క్ నుంచి సూరారం వరకు గల 45, 15, 28 సర్వే నంబర్లలో అటవీశాఖ ద్వారా పెండింగ్లో ఉన్న ఫెన్సింగ్, డీమార్కింగ్ చేయాలన్నారు. గిరినగర్లోని సర్వేనంబర్ 150లో ఉన్న 7 ఎకరాల హెచ్ఎంటీ ప్రాగాటూల్స్ కంపెనీ ఆధీనంలో ఉన్న భూమిని ముస్లింల గ్రేవ్యార్డుకు కేటాయించాలన్నారు. బాచుపల్లి నుంచి గండిమైసమ్మ, భౌరంపేట్.. కొంపల్లి నుంచి బహదూర్పల్లి, దూలపల్లి రోడ్డు వెడల్పు పనులకు ఆర్అండ్బీ శాఖకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా స్థల కేటాయింపులకు అనుమతులు ఇచ్చేలా చూడాలన్నారు. గాజులరామారంలోని ఎస్ఆర్నగర్లో సర్వేనంబర్లలో 321, 322, 325లలో స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ ఎన్ఓసీ క్లియరెన్స్, డీమార్కింగ్ చేయాలన్నారు. జీడిమెట్ల డివిజన్ పరిధి ఎంఎన్రెడ్డి నగర్లోని 91/1 సర్వేనంబర్లోని 5.28 ఎకరాల భూమిని డీనోటిఫికేషన్ చేయాలన్నారు. నిజాంపేటలో కోర్టు పరిధిలో ఉన్న పెండింగ్ కేసులపై చర్యలు చేపట్టాలని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు.
పూర్తిస్థాయి హక్కులు లేవు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏండ్ల తరబడి భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని.. భూ యజమానులు పూర్తిస్థాయి హక్కులు రావడం లేదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సమస్యలపై కలెక్టర్ స్పందించారని.. త్వరలోనే నియోజకవర్గంలో పర్యటించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని అన్నారని వివరించారు.