న్యూఢిల్లీ: అండర్-19 ప్రపంచకప్లో మెరిసిన యువ ఆటగాళ్లు లయ కోల్పోకుండా ఉండేందుకు బీసీసీఐ, భారత క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకురానున్నాయి. అండర్-16, అండర్-19, అండర్-23, ఏ-టీమ్ (అండర్ -25)ల మాదిరి.. ‘19 ప్లస్’ అనే కొత్త విభాగాన్ని తీసుకురావాలని బోర్డు, ఎన్సీఏ భావిస్తున్నాయి. యువ క్రికెటర్ల కోసం పంచమ మార్గాన్ని పాటించాలని క్రికెట్ బోర్డు యోచిస్తున్నది. దీనికోసం బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. తాజాగా అండర్-19 ప్రపంచకప్ చేజిక్కించుకోవడం లో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్, తెలుగు క్రికెటర్ షేక్ రషీద్, రవికుమార్, రాజ్ బవా భారత సీనియర్ జట్టు లో స్థానం సాధించాలని తహతహలాడుతున్నారు. అయితే ఈ జాబితాలో ఇప్పటికే చాలామంది సీనియర్లు క్యూలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పోటీలో జూనియయర్లకు చాన్స్ దక్కడం అంత సులువు కాదు! అప్పటి వరకు వీరి వయసు మించిపోతుంది. దీంతో వీరంతా లయ కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో అండర్-19 ప్రపంచకప్ నెగ్గిన జట్టులోని ప్లేయర్లు ఉన్ముక్త్చంద్, రవికాంత్, కమల్, మన్జోత్ కల్రా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ యువ కిషోరాలకు అలాంటి ఇబ్బంది కలగకుండా ‘19 ప్లస్’ అనే కొత్త ప్రతిపాదన తీసుకురానున్నారు. దీంతో టీమ్ఇండియాలో స్థానం కోసం ఎదురుచూస్తున్న వారికి కొంత ఊరట లభించే అవకాశం ఉంది.