హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్.. బడ్జెట్ ప్రసంగంలో ధర్మశ్లోకాన్ని ప్రస్తావించి.. అధర్మ ప్రవచనం చేశారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్రంగా విమర్శించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఇదేనా ధర్మం?
దురదృష్టం కొద్దీ బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు మహాభారతంలోని శాంతి పర్వంలో ఉన్న శ్లోకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కోట్ చేశారు. ‘దాపయిత్వా కరం ధర్మ్యం.. రాష్ట్రం నిత్యా యథావిధి’. ఇది భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకు చెప్పిన సందేశం. ఒక రాజ్యాన్ని రాజు ఎలా నడపాలి, ఎంత ధర్మనిష్టతో ఎంత కర్తవ్య నిష్టతో పాలించాలి? ఎంత గొప్పగా తీసుకొని పోవాలి అని చెప్పిన ధర్మసందేశం. మనం రోజూ పూజల్లో కానీ యాగం చేసేటప్పుడు కానీ చూస్తాం కదా? పూర్తయిన తరువాత శాంతిమంత్రం చెప్తారు. క్షమాపణ మంత్రం చెప్తారు. తరువాత లోక హితాన్ని కోరుతూ ‘స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహీశా.. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినోభవంతు’ అని చెప్పి ముగిస్తారు. ప్రజలు అందరూ బాగుండాలి. గోవులకు శుభం జరగాలి, పాడిపంటలు బాగుండాలి. న్యాయమార్గంలో ఈ మహిని మహీషుడు పరిపాలించాలి. రాజులు ఈ భూమిని న్యాయ మార్గంలో ధర్మమార్గంలో పరిపాలించాలని చెపుతారు.
మంచిని ఆశించి అందరూ సుఖంగా బతకాలని చెపుతారు. ఆర్థికమంత్రి చెప్పింది శాంతి పర్వంలోని ధర్మమార్గం శ్లోకం.. ప్రవచించిందేమో అధర్మం. ఆర్థిక మంత్రి ఆత్మవంచన చేసుకొంటూ దేశ ప్రజలను చాలా ఘోరంగా, చాలా దారుణంగా వంచించారు. నిర్మలమ్మా ఇక్కడ బతికినవ్, ఈ గడ్డ నీళ్లు తాగినవు. తెలుగువారి కోడలంటవు. నీవు ఆత్మద్రోహం చేసుకున్నవ్ కదా ఇవాళ. మన హైదరాబాద్ యెక్క ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు శిఖండిని తెచ్చిపెట్టిండు ఇవాళ మోడీగారు అహ్మదాబాద్లో. శాంతిపర్వం శ్లోకం చెప్పినవే.. నీ ఆత్మ ఘోషించలేదా. సిగ్గు అనిపించలేదా నిర్మలా సీతారామన్ గారు? మహాభారత శాంతిపర్వాన్ని కోట్ చేస్తావు. ఈ దిక్కుమాలిన నీ పచ్చి అబద్ధాలకు.. ఇంకేం దొరకలేదా నీకు. ఇప్పుడేం చేస్తరు బీజేపోళ్లు. మీకు తెలుసు.. సాయి సంసారీ, లచ్చిదొంగ.. వట్టితనే వచ్చి పిచ్చివొర్రుడు. సిల్లీ లాంగ్వేజ్లో తిట్టుడు. కేసీఆర్ను పట్టుకొని వెయ్యి తిట్లు తిడ్తరు ఇగ రేపటి నుంచి.