కరీంనగర్ : హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రచారం నిర్వహించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. కేంద్రాల్లో సిబ్బంది మాస్క్లు, ఫేస్ షీల్డ్, గ్లౌసులు ధరించాలని చెప్పారు. ఓటు వేసే కుడి చేతికి తొడుగు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ కేంద్రంలో ఏఎన్ఎం, హెల్త్ వర్కర్ను నియమించాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో మాస్కులు, శానిటైజర్లు, గ్లౌసులు, థర్మల్ స్కానర్లు అందుబాటులో ఉంచాలన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే ఎన్నికల ప్రచారం నిర్వహించాలని, ఆ తర్వాత ప్రచారం నిర్వహిస్తే నిబంధనల మేరకు కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సాయంత్రం 7 గంటల తర్వాత ధూంధాంలు, డ్యాన్సులు నిర్వహించరాదని, ఎన్నికల ప్రచారంలో ర్యాలీలు, బైక్ ర్యాలీ నిర్వహించొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కఠిన చర్యలుంటాయన్నారు. పోలింగ్కు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఇన్ డోర్ అయితే 200 మందితో, స్టార్ క్యాంపెయినర్లతో నిర్వహించే బహిరంగ సమావేశాలకు 1,000 మందితో, సాధారణ సమావేశాలకు 500 మందికి మించకూడదని తెలిపారు.
సిబ్బందికి బ్యాచ్లవారీగా శిక్షణ
ఎన్నికల సిబ్బందికి నిర్వహించే శిక్షణా కార్యక్రమాలను బ్యాచ్ల వారీగా నిర్వహించాలని సిబ్బంది భౌతిక దూరం పాటించేలా చూడాలని, మాస్కులు ధరించి శిక్షణకు వచ్చేలా చూడాలని కలెక్టర్ నోడల్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మున్సిపాలిటీలు గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో శానిటైజేషన్ చేయించాలని తెలిపారు. పోలింగ్ సిబ్బంది తప్పని సరిగా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ చేయించుకొవాలని అన్నారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ చేయించుకున్న పోలీస్ సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించాలని అడిషనల్ డీసీపీకి సూచించారు.
బెల్టు షాపులు మూసివేయించాలి
హుజూరాబాద్ నియోజకవర్గంలో బెల్ట్ షాపులను మూసివేయించాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఎన్నికల సామగ్రితో వెళ్లే పోలింగ్ సిబ్బందికి ఫిట్నెట్తో ఉన్న వాహనాలు సమకూర్చాలని ఉప రవాణా శాఖాధికారిని ఆదేశించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైవల్ టీమ్, వీడియో సర్వైలెన్స్ టీమ్, వీడియో వ్యూయింగ్ టీంల పని తీరును జీపీఎస్ ద్వారా మానిటరింగ్ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్లాల్, గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, నోడల్ అధికారులు పాల్గొన్నారు.