హైదరాబాద్ : తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ర్టంగా పరిణామం చెందింది అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం ముగిసింది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి, రైతుకు యంత్రాంగం అండగా నిలబడాలని సూచించారు. ప్రజా అవసరాలకు కేటాయించిన భూములను రిజిస్ర్టేషన్ చేయాలి. పంచాయతీలు, మున్సిపాలిటీల పేర్లపై రిజిస్ర్టేషన్ చేయాలి. కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. వ్యవసాయ శాఖ, పోలీసులు కల్తీ విత్తనాలను అరికట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష అధికారాలు వాడాలన్నారు.
పోడు భూముల సమస్య పరిష్కారానికి సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల హద్దులు గుర్తించాలని చెప్పారు. అటవీ భూముల హద్దులు గుర్తించాలని అటవీశాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), 2019 బ్యాచ్ ఐఏఎస్ లు, డీఎఫ్ఓలు, కన్జర్వేటర్లు, డీపీవోలు, డీఆర్ డీవోలు, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులు హాజరయ్యారు.