వ్యవసాయానికి, విద్యుత్తుకు ఉన్న విడదీయరాని బంధం మన రైతాంగానికి తెలుసు. రైతులందరూ వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతారు. అందుకే, తెలంగాణ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యల్లో ఒకటి వ్యవసాయ రంగానికి 24 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోని విద్యుత్ ప్రసార పంపిణీ వ్యవస్థలను పటిష్ఠపరచడంలో భాగంగా వందలాది విద్యుత్ ఉపకేంద్రాలను, వేలాది కిలోమీటర్ల పొడవైన ప్రసార/పంపిణీ లైన్లను, కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించడం ఇంకొకటి.
నేడు దేశం మొత్తానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. వలసకూలీల జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లా నేడు పచ్చని నేలతో మెరిసిపోతున్నది. ఏడేండ్ల కింద 130 లక్షల ఎకరాలున్న సాగు విస్తీర్ణం, నేడు 204 లక్షల ఎకరాలకు పెరిగింది. ఏడేండ్ల కిందట ‘ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’కు కేవలం 24 లక్షల టన్నుల ధాన్యం ఇచ్చిన రాష్ట్రం నేడు 140 లక్షల టన్నులు ఇచ్చే స్థాయికి ఎదిగింది. అనితరసాధ్యమైన ఈ వ్యవసాయ విజయాలన్నింటి వెనుక రాష్ట్ర ప్రభుత్వ సాహసోపేత ‘24 గంటల నాణ్యమైన, ఉచిత విద్యుత్ సరఫరా’ ఉందనడం అతిశయోక్తి కాదు.
రైతులకు కరెంటు, నీటి అవసరాలను గుర్తించడంలో తెలంగాణ సాధించిన ఈ విజయాన్ని అర్థం చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. విద్యుత్ చట్టంలో సవరణలు తెచ్చి, విద్యుత్ను పూర్తిగా ప్రైవేట్శక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం పావులు కదుపుతున్నది. కేంద్రం తీసుకురానున్న ‘విద్యుత్ సవరణ చట్టం-2021’ కార్పొరేట్ శక్తుల చేతుల్లో రూపుదిద్దుకోవడమే ఉదాహరణ. ఒకవైపు దేశంలో సోలార్ పవర్ టార్గెట్ను ఏకంగా 500 గిగావాట్లకు పెంచడం, మరోవైపు సోలార్ పవర్ రంగంలోకి అంబానీ, అదానీలు పెద్దఎత్తున రావడం గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతున్నది.
విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా పోటీ పెరిగి వినియోగదారులకు మేలు జరుగుతుందని కేంద్రం ఉత్త మాటలు చెప్తున్నది. కానీ అటు జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఖర్చులను, ఇటు విద్యుత్ పంపిణీ సంస్థల విద్యుత్ కొనుగోళ్ల ఖర్చులను పుట్టి ముంచుతున్న బొగ్గు ధరలను, రైల్వే రవాణా ధరలను ఎట్లా అదుపులోకి తెస్తుందో ఒక్కమాట కూడా చెప్పడం లేదు. పైగా అదానీల సోలార్ వ్యాపారాలకు పరోక్షంగా మేలు చేకూర్చే రెన్యువబుల్ విద్యుత్ లక్ష్యాల కోసం భారీ అపరాధ రుసుముల విధింపు. భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్ట్రిసిటీ అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉన్నది. అనేక భిన్న ప్రాంతాల సమాహారంగా ఏర్పడిన భారతదేశంలో భిన్న సామాజిక, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, రాజ్యాంగ నిర్మాతలు కరెంటు వంటి సున్నితమైన అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చారు. అంటే స్థానిక అవసరాలను బట్టి రాష్ర్టాలు విద్యుత్ చట్టాలు చేసుకోవచ్చు. వాటిద్వారా అవసరమైన రంగాలకు రాయితీలు కల్పించి వాటిని వృద్ధిలోకి తీసుకురావచ్చు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం చేస్తున్నదిదే.
రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటివరకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలకు సంబంధించిన అనేక అంశాల్లో రెట్టింపు కన్నా ఎక్కువ ప్రగ తి సాధించి, అత్యుత్తమ పనితీరులో జాతీయ సగటుకు అందనంత ఎత్తులో ఉన్నాం. విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతి, ఇతర రాష్ర్టాలకు అందని ద్రాక్షే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014, జూన్ 2 నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, 2021 జనవరి నాటికి 16,249 మెగావాట్లకు పెరిగింది. సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు ఉండగా, నేడు 3,793 మెగావాట్లుగా ఉన్నది. రాష్ట్రం ఏర్పడిన రోజు విద్యుత్ వినియోగం 144 మిలియన్ యూనిట్లు ఉండగా ప్రస్తుతం 280 మిలియన్ యూనిట్లు విద్యుత్ వాడకం జరుగుతున్నది. పీక్ డిమాండ్ కూడా రెండు రెట్లకు పైగా పెరిగి 13,562 మెగావాట్లుగా 2021, జనవరిలో నమోదైంది.
రాష్ట్రం ఏర్పడినపుడు ట్రాన్స్మిషన్ వ్యవస్థలో 400 కేవీ సబ్స్టేషన్లు 6 మాత్రమే ఉంటే నేడు అవి 21 ఉన్నాయి. అట్లనే, 220 కేవీ సబ్స్టేషన్లు 51 మాత్రమే ఉంటే, అవి నేడు 93కు, 132 కేవీ సబ్స్టేషన్లు 176 ఉంటే అవి నేడు 241కు పెరిగాయి. మొత్తంగా 233గా ఉన్న ఈ హెచ్టీ సబ్స్టేషన్లు 355కు చేరుకోగా 14,973 మెగావాట్ల ట్రాన్స్మిషన్ సామర్థ్యం 36,934 మెగావాట్లకు అంటే 150 శాతానికిపైగా పెరిగింది. తలసరి వినియోగం కూడా 1,200 యూనిట్ల నుంచి 2,071 యూనిట్లుగా నమోదైంది. ఇక పంపిణీ రంగం (డిస్ట్రిబ్యూషన్ రంగం) విషయానికి వస్తే రాష్ట్రం ఏర్పడిన రోజున 33/11 కేవీ సబ్స్టేషన్లు 2,178 మాత్రమే ఉంటే, నేడు దాదాపు 3,200కు చేరుకున్నాయి. గృహ వినియోగదారులు 85 లక్షల 93 వేల నుంచి కోటి 18 లక్షలకు, వాణిజ్య వినియోగదారులు 10 లక్షల 42 వేల నుంచి 15 లక్షలకు చేరుకున్నారు. ఇక దేశంలోనే అత్యధిక వ్యవసాయ పంపుసెట్లు ఉన్న రాష్ట్రం మనదే. మొత్తంగా విద్యుత్రంగం మన రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నది కాబట్టే, కేవలం ఏడేండ్లలో వేలాది భారీ, చిన్నతరహా పరిశ్రమలు రాష్ట్రంలో కొలువుదీరాయి.
ప్రత్యేకించి విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఇంతటి అభివృద్ధి సాధించి, రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అంది స్తూ పటిష్ఠమైన స్థితిలో ఉన్న ఈ పరిస్థితుల్లో, కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ సవరణల చట్టం అమల్లోకి వస్తే రాష్ట్ర విద్యుత్ వినియోగదారులు ఎదుర్కోబోయే దుష్పరిణామాల గురించి అందరం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
(వ్యాసకర్త: ఏడీఈ, కంపెనీ ప్రెసిడెంట్, టీఎస్ఎస్పీడీసీఎల్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్)
తుల్జారాం ,సింగ్ ఠాకూర్
78930 05313