న్యూఢిల్లీ, ఆగస్టు 10: పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయటాన్ని మహా పాపంగా ప్రచారం చేస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, తన రాజకీయ ప్రయోజనాలు నెరవేరుస్తున్న దర్యాప్తు సంస్థలకు మాత్రం వందలకోట్ల నిధుల వరద పారిస్తున్నది. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి 8 ఏండ్లలో పది లక్షలు కూడా ఇవ్వని కేంద్రం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి మాత్రం అడిగిందే తడవుగా ఉద్యోగులు, నిధులు సమకూరుస్తున్నది.
మోదీ పాలనలో ఈడీ కార్యకపాలాలు ఎంతటి వివాదాస్పదమవుతున్నాయో తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం 2014 తర్వాత ఈడీకి మోదీ సర్కారు బడ్జెటరీ నిధుల కేటాయింపు నాలుగింతలు చేసింది. 2020-21లో రూ.265.80 కోట్లు కేటాయించిన కేంద్రం.. 2021-22లో రూ.311.49 కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.357.57 కోట్ల నిధుల వరద పారించింది. ఉద్యోగుల సంఖ్యను సైతం భారీగా పెంచింది. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ప్రవర్తన్ భవన్లో అత్యాధునిక మైన కార్యాలయాన్ని సమకూర్చిపెట్టింది. తనకు అనుకూలమైన సంజయ్ కుమార్ మిశ్రాకు ఎక్స్టెన్షన్ ఇచ్చి మరీ కొనసాగించింది. ఉద్యోగుల్లో రెవెన్యూ ఇంటెలిజెన్స్ నిపుణులతోపాటు వివిధ రకాల వృత్తి నిపుణులను నియమించుకొన్నది. పీఎంఎల్ఏ తోపాటు 32 ఇతర రకాల చట్టాలను ప్రయోగించి ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేందుకు ఈడీని అస్త్రంగా వాడుకొంటున్నది. గతంలో కేసుల విషయంలో ఈడీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనేదని, ప్రస్తుతం ఎక్కడ, ఎవరిని టార్గెట్ చేయాలనే సూచనలు తమకు ముందుగానే అందుతున్నాయని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ ఈడీ అధికారి తెలిపారు.