న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: క్రిప్టోకరెన్సీ లావాదేవీల నుంచి పొందే లాభాలపై పన్ను వేసే చట్టపరమైన హక్కు ప్రభుత్వానికి ఉన్నదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ క్రమంలోనే ‘ముందైతే పన్ను వేశాం.. నిషేధిస్తామా? లేదా? అన్నది తర్వాత నిర్ణయిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను ఈ నెల 1న పార్లమెంట్లో ప్రకటించిన బడ్జెట్పై శుక్రవారం రాజ్యసభలో సాధారణ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యురాలు ఛాయ వర్మ ప్రశ్నకు మంత్రి పైవిధంగా బదులిచ్చారు. క్రిప్టోకరెన్సీల ద్వారా పొందే ఆదాయంపై గరిష్ఠంగా 30 శాతం పన్నును బడ్జెట్లో మోదీ సర్కారు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానున్నది. కాగా, ‘క్రిప్టోకరెన్సీలను చట్టబద్ధం చేస్తామా? లేదా? అన్నది నేను ఇప్పుడే చెప్పలేను. నిషేధం విధిస్తామా? లేదా? అన్నది తర్వాత తేలుతుంది. ఈ అంశంపై చేపట్టే సంప్రదింపుల్లో వచ్చే స్పందన ఆధారంగా దానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని ఆర్థిక మంత్రి అన్నారు. అలాగే ‘క్రిప్టోకరెన్సీ లావాదేవీల నుంచి అందుకునే లాభం చట్టబద్ధమైనదా?.. చట్టవిరుద్ధమైనదా?.. అన్నది వేరే ప్రశ్న. కానీ దాని (క్రిప్టోకరెన్సీ)పై పన్ను వేసే చట్టపరమైన హక్కు ప్రభుత్వానికి ఉన్నది. అందుకే నేను పన్ను వేశాను’ అని పేర్కొన్నారు. తన బడ్జెట్ ప్రసంగంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీచేసే డిజిటల్ రుపీని మాత్రమే కరెన్సీగా గుర్తిస్తామని, మిగతా ప్రైవేట్ డిజిటల్ ఆస్తులన్నిటి నుంచి పొందే లాభాలపై ప్రభుత్వం 30 శాతం పన్నును ఏప్రిల్ 1 నుంచి విధిస్తుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేసిన సంగతి విదితమే. అంతేగాక ఏడాదిలో రూ.10వేలకు మించి క్రిప్టోకరెన్సీలకు సంబంధించి చెల్లింపులు జరిపితే ఈ జూలై 1 నుంచి 1 శాతం టీడీఎస్ కూడా వర్తిస్తుందన్నారు. అయితే ఐటీ చట్టం కింద అకౌంట్ల ఆడిటింగ్ జరిగే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు ఈ పరిమితిని రూ.50వేలుగా నిర్ణయించారు.
బడ్జెట్తో ఆర్థిక సుస్థిరత
కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధిబాట పట్టించేలా బడ్జెట్ను తెచ్చామని నిర్మలా సీతా రామన్ అన్నారు. పెరిగే కొనుగోళ్ల శక్తి, పెట్టుబడుల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇక అధిక ధరలపై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూ.. జీడీపీ రూ.9.57 లక్షల కోట్లమేర కోల్పోయినా.. ద్రవ్యోల్బణం మాత్రం 6.2 శాతంగానే ఉన్నట్టు చెప్పారు.