మొన్నటికి మొన్న సిలిండర్ ధరపై ఈటలకు సవాల్ విసిరిన.. కనపడితే ఒట్టు.. ఇప్పుడు పెట్రో ధరల పెంపుపై కేంద్రమంత్రి కిషన్రెడ్డికి చాలెంజ్.. ప్లేస్ ఎక్కడైనా, ఎప్పుడైనా సరే మీరే డిసైడ్ చేయండి.. చర్చకు నేను రెడీ అంటున్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు. నా చాలెంజ్ స్వీకరించటానికి సిద్ధమా? నా ప్రశ్నలకు బదులివ్వడానికి రెడీనా? అని కిషన్రెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం హుజూరాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన హరీశ్.. పెట్రో ధరలు మొదలుకొని రాష్ట్ర పథకాల్లో కేంద్ర నిధులున్నాయన్న వ్యాఖ్యల దాకా బీజేపీ నేతల అబద్ధాలను ఎండగట్టారు.
కరీంనగర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారంతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని, నలుగురు నాలుగు దిక్కులు వెళ్లి, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటాలు ఉన్నాయని, నడిరోడ్లపై సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పటంలో బీజేపీ నాయకులు వారికి వారే సాటి అని, వాళ్లకు ఆస్కార్ అవార్డులు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఇల్లందకుంట మండలంలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పిన విషయాలపై మంత్రి హరీశ్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఏడేండ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి కిషన్ రెడ్డి ఆత్మవంచన చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పటంలో బీజేపీని మించినోళ్లు లేరని.. ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రాష్ర్టానికో ప్రాజెక్టు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవడానికి ఎన్నెన్నో బూటకపు వాగ్ధానాలు చేస్తామని కేంద్రమంత్రులు చెప్పిన మాటలు కిషన్రెడ్డికి తెలియదా? అని నిలదీశారు. బీజేపీ అబద్ధాలు తెలిసే.. వేల కోట్లు ఖర్చు చేసినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, కేంద్ర బలగాలను దించి కేసులు పెట్టించినా పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీని ఘోరంగా ఓడించారని తెలిపారు. కేరళ, తమిళనాడులోనూ బీజేపీకి ఇదే పరిస్థితి ఎదురైందని గుర్తుచేశారు.
పెట్రోల్, డీజిల్పై కేంద్రం 3 పన్నులు
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి క్రూడాయిల్ ధరలు పెరగటమే కారణమని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీతో పాటు రోడ్ సెన్స్, సర్చార్జ్ అని మూడు రకాల పన్నులు వేస్తున్నదని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాకముందు 2014లో ఒక లీటర్ పెట్రోల్ మీద పన్ను రూ.10.43 ఉండేదని, ఈ రోజు రూ.32.90కు పెంచిందని చెప్పారు. డీజిల్పై 2014లో ఒక లీటర్కు పన్ను రూ.4.52గా ఉండగా, ఇప్పుడది రూ.31.80 పెరిగిందని లెక్కలు తీశారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ మీద కేవలం రూ.99.68 వేల కోట్ల ఆదాయం వస్తే, 2020-21లో రూ.3,72, 970 కోట్ల ఆదాయం వచ్చిందని అన్నారు. ఈ ఏడేండ్ల లెక్కతీస్తే కేంద్రం దేశ ప్రజలపై రూ.10 లక్షల కోట్ల అదనపు భారాన్ని మోపిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. అయినా, పెట్రో ధరలకు, కేంద్రానికి సంబంధం లేదని కిషన్రెడ్డి చెప్పుకోవడం సిగ్గు చేటు అని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్లో పెట్రోల్, డీజిల్పై ధరలు పెంచింది వాస్తవమని చెప్పారని, దీనిపై మాట్లాడేందుకు తాను సిద్ధమని, కేంద్రమంత్రిగా మీరు సిద్ధమా? అని కిషన్రెడ్డికి సవాల్ విసిరారు.
ఈటల మరి ఆనాడు గిట్లంటివి కదా!
కేంద్రం నల్లా చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుదామని ఆనాడు చెప్పిన ఈటల, ఈ రోజు కాషాయ కండువా కప్పుకొని బీజేపీ గొప్ప పార్టీ అని అంటున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. కరోనా సమయంలో బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారని, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు ఇస్తలేరని, కరోనా విషయంలో కేంద్రం చేతులెత్తేసిందని, తెలంగాణను చిన్న చూపు చూస్తున్నదని తిట్టావు కదా! మాట మార్చిందెవరు? అబద్ధాలు చెప్తున్నది ఎవరు? అనేది ప్రజలకు అర్థం అవుతోందని అన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉన్నపుడు కేసీఆర్ కిట్లు రాష్ట్రప్రభుత్వమే ఇస్తున్నదని చెప్పిన ఈటల, బీజేపీలో చేరగానే ఇందులో కేంద్రం నిధులు రూ.5వేలు ఉన్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజామాబాద్ రైతులకు పంగనామాలు పెట్టిన అరవింద్ ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నాడని అన్నారు. నిజామాబాద్ రైతులను అడిగితే ఆయన బాండ్ పేపర్ బాగోతం చెప్తారని ఎద్దేవాచేశారు.
ఒక్క పైసా కేంద్రానిది కాదు
‘టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధు కింద ఎకరాకు రూ.5వేల చొప్పున ఇప్పటివరకు రూ.43.37వేల కోట్లు ఇచ్చాం. ఇందులో ఒక్క పైసా కూడా కేంద్రానికి కాదు. 30 లక్షల కరెంట్ మోటర్లకు ఉచిత విద్యుత్తు కింద రూ. 33,899 కోట్లు ఇచ్చాం. కల్యాణ లక్ష్మి కింద రూ.9,35,252 మందికి రూ.7,814 కోట్లు, రైతుబీమా కింద ఇప్పటి వరకు 60,340 రైతుల కుటుంబాలకు రూ.3,017 కోట్లు ఇచ్చాం. కేసీఆర్ కిట్ల కింద 12.53 లక్షల మందికి రూ.1,287 కోట్లు ఖర్చుచేశాం. ఇందులో ఒక్కపైసా కూడా కేంద్ర ప్రభుత్వానిది లేదు’ అని హరీశ్రావు స్పష్టంచేశారు. ఆసరా పెన్షన్లకు ఇప్పటి వరకు రూ.39,228 కోట్లు ఖర్చు చేస్తే ఇందులో కేంద్ర వాటా 3.9 శాతం మాత్రమేనని వివరించారు. ఆసరా పెన్షన్లో కొసరు ఇచ్చి మేమేదో ఇచ్చామని ఈటల రాజేందర్ అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. తాను చెప్పిన వాటిలో అబద్ధాలుంటే నిరూపించండని కిషన్రెడ్డి, ఈటలకు ఆయన సవాల్ విసిరారు.
ఈటల గెలిస్తే బీజేపీకి, టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు లాభం
హుజూరాబాద్ ప్రజలు బీజేపీని నమ్మొద్దని, ఇంకా రెండున్నరేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్రంలో ఉంటుందని హరీశ్రావు స్పష్టంచేశారు. రాజేందర్ గెలిస్తే బీజేపీకి లాభమైతదని, అదే టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు లాభమైతదని అన్నారు. బీజేపీని గెలిపిస్తే ప్రజలు నిండా మునగాల్సి వస్తుందని చెప్పారు. ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు దళితబంధు ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాశారని, సీఎం కేసీఆర్ సభ పెట్టుకుంటామని ప్రయత్నిస్తే గైడ్లైన్స్ మార్చి, పక్క జిల్లాల్లో కూడా సభ పెట్టకుండా చేశారని అన్నారు. హుస్నాబాద్లో సభకు అడ్డురాని ఎన్నికల కోడ్ కేసీఆర్ సభకు అడ్డం వస్తదా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, లింగంపల్లి కిషన్రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్ పాల్గొన్నారు.
నా సవాల్కు స్పందనేది?
సిలిండర్ మీద రాష్ట్ర పన్ను రూ.291 ఉందని ఈటల రాజేందర్ అబద్ధం చెప్పారని, దాన్ని రుజువు చేస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరినా ఆయన ముందుకు రాలేదని మరోసారి గుర్తుచేశారు. సిలిండర్ మీద రాష్ట్ర ప్రభుత్వ పన్నే లేదని, కేంద్రమే రూ.వెయ్యికి పెంచిందని హరీశ్ చెప్పారు. ఇక, దళితబంధు ఆపలేదని బీజేపీ నాయకులు అబద్ధం చెప్తున్నారని, కానీ ఈ నెల 7న ఎన్నికల సంఘానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి లేఖ రాశారని అన్నారు. ఆ లేఖను మీడియా సమావేశంలో హరీశ్ ప్రదర్శించారు. ఈటల తెలివిగా తాను లేఖ రాయలేదని చెప్తున్నారని, ఆయన వేరు, ఆయన పార్టీ వేరా? అని ప్రశ్నించారు. అయినా వచ్చే నెల 2 తర్వాత దళితబంధు ఇచ్చి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.
మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తే, తానిచ్చిన చెక్కులు చెల్లనివని అబద్ధాలు చెప్తున్నారని, బీజేపీలో చేరాక రాజేందర్కు కూడా ఆ వాసన అంటిందని హరీశ్ ఎద్దేవాచేశారు. రూ.25.69 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను హుజూరాబాద్ మహిళలకు పంపిణీ చేశామని, పండుగ పూట వారు సంతోషంగా ఉన్నారని అన్నారు. జమ్మికుంట, హుజూరాబాద్లలో రోడ్లు వేస్తే అందులో 90 శాతం నిధులు కేంద్రానివేనని మరో అబద్ధం చెప్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే టీయూఎఫ్ఐడీసీ నిధులు, సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఇచ్చిన రూ.100 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో రోడ్లు వేశామని స్పష్టంచేశారు.
ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు.. వేశారా?
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఆ ఉద్యోగాలెక్కడ?
పెట్రో ధరలు తగ్గిస్తామని చెప్పారు.. పెంచుడే తప్ప తగ్గింపేది?
రాష్ర్టానికో ప్రాజెక్టు కడతామంటిరి.. ఇంకా నెరవేర్చలేదెందుకు?
రాష్ర్టానికి గిరిజన వర్సిటీ ఇంకా రాలేదు
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ జాడ లేదు
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదు