అందరూ ట్రాక్టర్లే కొంటే నీది నడ్వదు. నాది నడ్వదు. ఎవ్వారం మొదటికి వస్తది. దళితబంధు విజయవంతం కావాలంటే అందరం ఒక్కటే పని చేయ్యొద్దు. అందుకే ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలు ఎట్ల వాడాలి అంటే నీకు వచ్చిన పని, నీకు నచ్చిన పని, నీవు విజయం సాధించగలిగే పని చేసుకోవాలి. –2021, ఆగస్టు 16న హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు
హైదరాబాద్, జనవరి 30: దళితబంధు నిధుల వినియోగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పక్కాగా ఆచరణలో పెడుతున్నది. లబ్ధిదారుల ఇంటింటికీ తిరుగుతూ వారికి ఏ ఉపాధి అత్యంత లాభదాయకంగా ఉంటుందో, ఏ రంగాన్ని ఎంచుకొంటే ఎలాంటి ఆదాయం, అవకాశాలు అందుబాటులో ఉన్నాయో తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నది. లాభదాయకమైన ఉపాధి మార్గాన్ని ఎన్నుకొనేలా ప్రోత్సహిస్తున్నది. హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా ప్రభుత్వం మొత్తంగా 21,568 మందికి దళితబంధు పథకం కింద రూ.10లక్షల చొప్పున అందజేస్తున్నది. దళితబంధు ప్రారంభించిన తొలినాళ్లలో లబ్ధిదారులు ఎక్కువమంది ఒకే రకమైన యూనిట్ను ఎంచుకొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో సగానికి పైగా ఫోర్ వీలర్ల కోసం పెట్టుకొన్నవే. ఈ నేపథ్యంలోనే అధికారులు ఏకంగా హుజూరాబాద్ కేంద్రంగా ప్రత్యేకంగా దళితబంధు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్, రెవెన్యూ, ఇతర శాఖ అధికారులను సమన్వయం చేసుకొంటూ లబ్ధిదారుల ఇంటింటికీ తిరుగుతూ వారికి లాభదాయకమైన ఉపాధి మార్గాలపై, అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో యూనిట్ను ఎంచుకొనేలా కాకుండా, ఇద్దరు నుంచి నలుగురు బృందాలుగా ఏర్పడి దళితబంధు నిధులను వినియోగించుకొనే అవకాశాలను వివరిస్తున్నారు. ఫలితంగా చాలా మంది లబ్ధిదారులు బృందాలుగా ఏర్పడి జేసీబీలు, హార్వెస్టర్లను కొన్నారు. కొందరు తాము ప్రాధాన్యతనిచ్చిన యూనిట్లపై నిర్ణయాన్ని మార్చుకొంటూ, అధికారుల సలహాతో మరో లాభదాయక యూనిట్ను ఎంచుకొంటున్నారు.
దళితులను ధనవంతులను చేయడమే సీఎం లక్ష్యం -మంత్రి చామకూర మల్లారెడ్డి
శామీర్పేట, జనవరి 30 : దళితులను ధనవంతులను చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మేడ్చల్ జిల్లా శామీర్పేట, మూడుచింతలపల్లి మండలాల్లోని యాడారం, మురహార్పల్లి, పోతారం గ్రామాల్లో పర్యటించి దళితబంధు లబ్ధిదారుల ఎంపిక సర్వేను పరిశీలించారు. ఫిబ్రవరి 10 లోపు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఎంపీపీలు ఎల్లూభాయి బాబు, హారికమురళిగౌడ్ పాల్గొన్నారు.
అవసరమైతే నైపుణ్య శిక్షణ
యూనిట్లను ఎంచుకొన్న లబ్ధిదారులకు ఆయా రంగాల్లో నైపుణ్యాలను పరీక్షించి, అవసరమైతే ప్రభుత్వమే స్వయంగా శిక్షణ ఇప్పిస్తున్నది. నియోజకవర్గంలో మొత్తం 1,503 మంది మినీ డెయిరీ యూనిట్లను ఎంచుకోగా, 801 మందికి కరీంనగర్ జిల్లా పశువైద్యాధికారులు, పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ ఇప్పించింది. లబ్ధిదారులకు శిక్షణ సర్టిఫికెట్లను కూడా అందజేసింది. వాహన యూనిట్లను ఎంచుకొన్న 6,892 మంది లబ్ధిదారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించింది.
మిగతా మండలాల్లో శరవేగంగా సర్వే
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ప్రభుత్వం ఇప్పటికే దళితబంధు కింద 76 మందిని ఎంపిక చేయగా, అందులో 56 మందికి నిధులను వారి ఖాతాల్లో జమచేసింది. మధిర నియోజకవర్గంలోని చింతకాని, తుంగుతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్, అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలాల్లోనూ దళితబంధు పథకం అమలు వేగవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం ఆయా మండలాలకు సంబంధించి ఇప్పటికే రూ. 250 కోట్లను విడుదల చేసింది. అధికారులు ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఆశయాన్ని నిలబెట్టాలి
దళితులను పేదరికం నుంచి దూరం చేసి, వారిని ప్రగతిపథంలో నడిపేందుకు ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ దళితబంధుకు శ్రీకారం చుట్టారు. దళితజాతి సమగ్రాభివృద్ధే ఉన్నత లక్ష్యంగా దీన్ని పక్కాగా అమలుచేస్తున్నారు. సీఎం ఆశయాన్ని నిలబెట్టి, పథకాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాల్సిన బాధ్యత లబ్ధిదారులపై ఉన్నది. మార్చికల్లా దళితబంధు గ్రౌండింగ్ను పూర్తి చేస్తాం. -బండ శ్రీనివాస్, చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్