బన్సీలాల్పేట్, ఫిబ్రవరి 3: ‘దళితబంధు’ పథకం ద్వారా లబ్ధిదారులు ఉపాధి పొందాలని, ఎస్సీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని హైద్రాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కే.రమేశ్ అన్నారు. సికింద్రాబాద్ మండల తహసీల్దార్ కే.బాలశంకర్తో కలిసి గురువారం సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, బన్సీలాల్పేట్ డివిజన్లో ‘దళితబంధు’ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లకు వెళ్ళి ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, కులం, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కే.రమేశ్ మాట్లాడుతూ ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అర్హులైన నిరుపేద దళితులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇందుకు ఎంపికైన వారికి పథకం గురించి సమగ్ర అవగాహన కల్పిస్తామని, వారికి స్వయం ఉపాధి కోసం ఎలాంటి అనుభవం ఉన్నదో తెలుసుకుని, అందుకు తగిన వ్యాపార, వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తామని అన్నారు. లబ్ధిదారులకు మంజూరైన పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి బ్యాంక్ ఖాతాలో జమ చేశాక, జిల్లా అధికారులు వారి వ్యాపారానికి సంబంధించిన సామగ్రిని, ముడి సరుకులు కొనుగోలు చేయడానికి మాత్రమే వాటిని వినియోగించేలా చర్యలు తీసుకుంటారని అన్నారు.
పథకాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మొదటి విడతలో రాని ఆశావాహులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వచ్చే 2022-23 ఆర్థిక సంవత్సరానికి మరో వందమంది చొప్పున రెండో దఫా లబ్ధిదారులకు అవకాశం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ మండల వీఆర్వో రవి కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.