శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. అంతలోనే యాదరుషి పాత్ర ప్రవేశిస్తుంది. యాదర్షి తపస్సు, నారసింహావతార ఆవిర్భావం గురించి త్రిభువన మల్లుడికి వివరిస్తాడు విజ్ఞానేశ్వరుడు .
ఉగ్రం వీరం మహావిష్ణుం – జ్వలంతం సర్వతోముఖమ్
నృసింహం భీషణం భద్రం – మృత్యోర్మృత్యుం నమామ్యహమ్
అకాల మృత్యుహరణం.. ఈ మంత్రం!
అంటే.. నూరేళ్ల నిండు వయసు కాకుండా అకాలంగా, ఆకస్మికంగా ముంచుకొచ్చే మృత్యువును రానివ్వకుండా చేస్తుంది ఈ నరసింహ మంత్రం!
మనకు చెడును, అరిష్టాలను, అడ్డంకులను కలిగించే దుష్ట
శక్తులకు ఉగ్రుడై, వీరుడై, మహావిష్ణు స్వరూపుడవుతాడు. చెడు శక్తులను నిర్మూలిస్తాడు. అంతేకాదు.. స్వామి తన తేజంతో అంతర్యామిగా ఉంటూ, సమస్త లోకాల్లోని దేవతలను, ప్రాణులను ప్రకాశింపజేస్తాడు. సూర్యుడు కూడా నృసింహుడి తేజోరూపమే!
ఏకాదశ పదాత్మకమైన ఈ మహామంత్రం ఇలా ఉంటుంది.
ఉగ్రం : నరసింహుడు నిత్య యవ్వనుడు. ప్రపంచాన్ని లయింపజేసేందుకే అవతరించినవాడు. ఉగ్రుడై అవతరించినవాడు అయినా, భక్తుల కోసం ప్రసన్నరూపం ధరించాడు. అనుగ్రహమూర్తి అయిన ఈ ఉగ్రమూర్తిని సేవించినవారికి వైరి వర్గం అనేదే ఉండదు. శత్రువులు ఉండరు. శత్రు భయమూ ఉండదు.
వీరం : నరసింహుడి సృష్టి.. తిరుగుతున్న చక్రంలా, ఆద్యంతాలు లేనిది.
సర్వాణి భూతాని విరమతి – విరామయతి
అజస్రం సృజతి వసృజతి వాసయతి..
దేవతా మూర్తులు, సకల ప్రాణికోటి శరీరానికి వశవర్తులు. కానీ, నరసింహుడు శరీర, ఇంద్రియాదులను తన వశంలో ఉంచుకొన్నాడు. ఈ మంత్రాన్ని పఠించిన వారు వీరులవుతారు. అసాధ్యం.. ఇది ఎప్పటికీ జరగదు అనుకొనే సంకల్పాలు, కార్యాలు కూడా ఈ స్వామి మహిమతో సాధ్యాలవుతాయి. అనుకొన్నవి నెరవేరుతాయి. కనుక రుగ్వేదం నరసింహుడిని ‘వీరుడు’ అని చెబుతున్నది.
మహావిష్ణుం : సాక్షాత్తూ మహావిష్ణువు యొక్క అవతారం. స్వామి సర్వవ్యాపి. ఈయనకంటే గొప్పవాడు లేడు. అగ్ని, సూర్యుడు, చంద్రుడు తానై ఉండి నడిపిస్తున్నాడు. స్థితి కారకుడు. ఈ మంత్రం శ్రద్ధగా మననం చేసుకోవడం వల్ల ‘ఉన్న స్థితి’ నుంచి ‘ఉన్నత స్థితి’కి చేరుకోవచ్చు.
జ్వలంతం : మూలాధారమైన రూపం అగ్ని. దుష్టశక్తులను, తన భక్తులు తెలియక చేసిన పాపాలను మహోగ్ర జ్వాలా రూపంలో దగ్ధం చేసే వాడు. మరొకవైపు మంగళరూపుడై.. లోకాలకు కాంతిని కలిగించేవాడు. జ్వలంతుడీ నరసింహుడు.
సర్వతోముఖం : అంటే.. నరసింహుడి అవతార రూపాలన్నీ ఆయన కోసం కాక, భక్తుల కోసమే అని తెలుసుకోవాలి. జ్ఞానం ద్వారా అన్ని వేళలా, అన్ని వైపులా, అన్ని ముఖాలుగా వ్యాపించి ఉంటాడు. స్వామిని స్మరిస్తూ ఈ ‘శ్లోకం’ చదివితే.. ఇక జీవితంలో ‘శోకం’ అనేదే ఉండదు.
నృసింహం : సలక్షణంగా ఆవిర్భవించిన విలక్షణ అవతారం.. నృసింహావతారం! అన్ని ప్రాణుల్లోకెల్లా మనిషి ఉత్తముడు. పంజా విసిరే పరాక్రమంలో సింహం శ్రేష్ఠమైనది. అందుకే, మనుష్య – సింహాల రూపం ధరించిన సింహదేవుడు.. శత్రువులకు భయాన్ని కలిగిస్తూ, భక్తులకు ‘అభయం’ ఇస్తాడు.
అంటే.. నరసింహుడి అవతారమే..
పరిత్రాణాయ సాధూనాం..
వినాశాయచ దుష్కృతాం!
భీషణం : ఈ పదానికి అర్థమూ, పరమార్థమూ ఉన్నాయి. ఎవరి భీషణ రూపాన్ని చూసి, సమస్త లోకాలు భయంతో పరుగులు తీస్తాయో అతడే భీషణ శబ్ద వాచ్యుడు.
భీషాస్మాద్వాతః పవతే –
భీషోదేతీసూర్యః
భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ –
మృత్యుర్ధావతి పంచమ ఇతి
స్వామి భీషణ రూపాన్ని చూసి వాయువు వీస్తున్నాడు. సూర్యుడు భయంతో ఉదయిస్తున్నాడు. భయం చేతనే అగ్ని ఇంద్రాదులు కూడా ఆజ్ఞానువర్తులై ఉంటారు. అందరి ప్రాణాలను ‘పాశం’తో లాగేసే యముడు కూడా భయపడి పరుగులు తీస్తాడు.
సర్వరక్షాకరం.. ఈ నరసింహ మంత్రం!
మహాశక్తిమంతమైన అకాల మృత్యుహరణ మంత్రాన్ని వివరిస్తున్నాడు విజ్ఞానేశ్వరుడు. ఆయన చెబుతున్న విధం..
ఒక్కొక్క పదమూ పరమపదంగా
కనిపిస్తున్నది. ఒక్కొక్క అర్థమూ జీవన పరమార్థంగా తోస్తున్నది.
ఒక్కొక్క వివరణా.. రమణీయమైన నరసింహుడి ప్రసన్న రూపాన్ని వ్యక్తం చేస్తున్నది.
ఒక్కొక్క శబ్దమూ.. ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కార అర్థ సూత్రాలతో కూడిన ప్రణవ మంత్రమై ప్రతిధ్వనిస్తున్నది.
విజ్ఞానేశ్వరుడి మాటలను భక్తిశ్రద్ధలతో మంత్రముగ్ధులై వింటున్న త్రిభువనమల్ల చక్రవర్తి, ఆయన ధర్మపత్ని మహారాణి చంద్రలేఖా దేవి భక్తిసాగరంలో లీనమైపోయారు.
చేతులు జోడించి అడిగింది చంద్రలేఖ..
“స్వామీ.. విజ్ఞానేశ్వరా! పవిత్రమైన పదకొండు పదాల మహామహా మంత్రం ఎలా మహాశక్తిమంతమైనదో, అంతుచిక్కని దాని మూల స్వరూపాలేమిటో విపులంగా వివరించారు. మమ్మల్ని తరింపజేశారు. ఉగ్రుడు, భీషణుడు అయిన స్వామివారు ఏవిధంగా భద్రుడు అయినాడో చెప్పండి”.
కనులు మూసుకొని ఒక్కసారి స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో స్మరించుకొన్నాడు విజ్ఞానేశ్వరుడు.
‘ఓం.. నమో నారసింహాయ’
అని అనుకొన్నాడు.
కనులు తెరిచి చూసి, చిరునవ్వుతో చెప్పాడు.
“అమ్మా.. చంద్రలేఖా దేవీ! నరసింహుడి అవతరణమే సకల లోకాల భద్రత కోసం సంభవించింది. స్వయంగా తాను భద్రుడై తనను సేవించే భక్తులకు సర్వదా భద్రాలను, క్షేమాన్ని కలిగిస్తుంటాడు. రుగ్వేదం ఈ విధంగా పలుకుతుంది..
భద్రం కర్ణేభిః శ్రుణుయామదేవాః
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః
స్థిరై రంగైస్తుష్టువాగ్ సస్తనూభిః
వ్యశేమ దేవహితం యదాయుః
అని అంటున్నారు దేవతలు”.
తన ముందే దేవతాగణాలు భక్తి పూర్వకంగా పఠిస్తున్నట్టు దృశ్యం గోచరమైంది.
“స్వామీ.. ఈ మంత్రానికర్థం?” అని అడిగింది రాణి చంద్రలేఖ.
“దేవతలమైన మేము చెవులతో నృసింహ ప్రతిపాదకమైన వేద సుస్వరాలను వింటున్నాము. ధ్యాన, యజ్ఞ యజనశీలురమైన మేము కనులతో ఇంద్రియరహితమైన నారసింహీయ రూపాన్ని చూస్తున్నాము. స్థిరమైన ప్రణవ సావిత్య్రాది అంగమంత్రాలతో నారసింహుని స్తుతిస్తూ గుణ విశిష్టమైన దీర్ఘాయుష్యాన్ని పొందుతున్నామని దేవతలందరూ సృసింహుని శుభకరమైన దర్శనాన్ని స్తుతించారు. అందుకే.. ఆయన భద్రపదవాచ్యుడయ్యాడు.
ఇక మృత్యోర్మృత్యుం..
భక్తులు తనను తలిస్తే చాలు.. వారికి మృత్యు, అపమృత్యు భయాలను నాశనం చేయగలడు.
య ఆత్మదా బలదాయస్య –
ఉపాసతే ప్రశిషవు యస్యదేవా
యస్య ఛాయామృతం యస్యమృత్యుః
కస్మైదేవాయ హనిషా విధేమ॥
మృత్యువుకే మృత్యువు నరసింహుడు. భక్తులకు బలాన్ని, శక్తినీ ఇస్తాడు. స్వామి ఛాయయే అమృతమయం! తన భక్తులు తనను ఆరాధించేందుకు కావలసిన శక్తినీ, లక్ష్య సిద్ధినీ ఆయనే ఇస్తాడు.
చివరగా నమామి.. అంటే, సకల దేవతలు, ముముక్షువులు, బ్రహ్మరుద్రులు ఈ దేవదేవుడికి నమస్కరిస్తున్నారు.
ఇంద్రుడు, మిత్ర శబ్దవాచ్యుడైన రవి, జలాంతర్యామి వరుణుడు, కర్మఫలాన్ని అందించే సూర్యుడు.. ఇతర దేవతలందరూ ఒక పెద్ద చెట్టును ఆశ్రయించి నివాసం ఏర్పాటు చేసుకొన్న పక్షుల్లాగా.. స్వామివారిని ఆశ్రయించుకొని, సేవిస్తూ ఉన్నారు. అందుకే ముక్కోటి దేవతలు ఒక్కటై.. స్వామికి నమస్కరిస్తుంటారు.
ఆవిధంగానే.. మహామహిమాన్వితమైన శ్రీ నృసింహ గాయత్రీ మంత్రం మహా శక్తిమంతమైనది.
ఓమ్ వజ్ర నఖాయ విద్మహే
తీక్ష దంష్ర్టాయ ధీమహి
తన్నో నృసింహః ప్రచోదయాత్
ఏ శక్తిసింహుని కొరకు ఈ సమస్తం కలదు. అని తెలుసుకొంటున్నామో, వజ్రాలవంటి కఠినమైన గోళ్లు కలిగిన వానియందు తత్పద ధ్యానవిశిష్టమైన మా మనసు లగ్నం అగుగాక. మహా సింహం భక్తులమైన మమ్ము ప్రేరేపించి శక్తి సంపన్నులుగా చేయుగాక. సింహ స్వరూపుడైన ఈ నరసింహుని ప్రసన్నం చేసుకోవాలంటే, చెడును పోగొట్టుకొని మంచి ఫలితాలను పొందాలంటే.. ఈ మంత్రాలను మనసులో అనుకొంటే చాలు”.
‘విజ్ఞానేశ్వరుడి కంఠంలో సింహనాదం వినిపిస్తున్నదా!’ అన్నంతగా ప్రభావితులయ్యారు.. ఆ నదీతీరంలో పవిత్ర ప్రవచన ప్రవాహాన్ని ఆస్వాదిస్తున్నవారంతా!
మళ్లీ చంద్రలేఖ ప్రశ్నించింది.
“విజ్ఞానేశ్వరా! మహిమ అనేది భగవంతునికై మనం చేసే అన్వేషణలో ఉందో, మన భక్తిలో ఉంటుందో, మన జన్మజన్మల పాపపుణ్యాల ఫలితంగా ఉంటుందో.. మాకు తెలియదు. కానీ మేము, మావంటి సాధారణ భక్తజనులు కోరుకొనేది ఒకటే! మాకు మంచి జరగాలి. మన చుట్టూ ఉన్నవారికి ఏ ఆపదలూ రాకుండా మంచి జరగాలి.. అనే”.
‘అవును’ అన్నట్టుగా తల పంకించాడు విజ్ఞానేశ్వరుడు.
“మేము కోరుకుంటున్నది వ్యక్తిగత సుఖ సంతోషాల కోసం కాదు. ఈ రాజ్య భవిష్యత్ కోసం. సకాలంలో పంటలు పండాలి. సుభిక్షంగా ఉండాలి. ప్రజలందరూ సౌభాగ్యంతో ఆనందంగా ఉండాలి. మన రాజ్యాన్ని ఎవరూ ఓడించకూడదు. శత్రు భయం లేకుండా ఉండాలి. నా భర్త, ఈ దేశాన్నేలే ప్రభువుల వారికి మనశ్శాంతి ఉండాలి. అందుకు మేమేం చేయాలో చెప్పండి..”
చంద్రలేఖ అడిగిన ప్రశ్న.. ప్రభువుల వారినీ ఆలోచింపజేసింది.
అవును, నిజమే!
ప్రజలు బాగుంటేనే, పరిపాలించేవాడు బాగుంటాడు.
వారు చల్లగా ఉండాలని దీవిస్తేనే.. ప్రభువు పదికాలాల పాటు సంతోషంగా జీవిస్తాడు.
“అవును విజ్ఞానేశ్వరా! మమ్ము ఏం చేయమంటారు?”.
త్రిభువనమల్లుడు అడిగిన ప్రశ్నకు విజ్ఞానేశ్వరుడు సమాధానం చెప్పబోతుండగానే.. ఒక విచిత్రం జరిగింది.
దూరం నుండి ఆశ్వికదళం చాలావేగంగా పరుగులు తీస్తూ సమీపిస్తోంది.
అకాల మృత్యుహరణం.. ఈ మంత్రం! అంటే.. నూరేళ్ల నిండు వయసు కాకుండా అకాలంగా, ఆకస్మికంగా ముంచుకొచ్చే మృత్యువును రానివ్వకుండా చేస్తుంది నరసింహ మంత్రం!మహాశక్తిమంతమైన అకాల మృత్యుహరణ మంత్రాన్ని వివరిస్తున్నాడు విజ్ఞానేశ్వరుడు. ఆయన చెబుతున్న విధంగా.. ఒక్కొక్క పదమూ పరమపదంగా కనిపిస్తున్నది. ఒక్కొక్క అర్థమూ జీవన పరమార్థంగా తోస్తున్నది.
ఒక్కొక్క వివరణా.. రమణీయమైన నరసింహుడి ప్రసన్న రూపాన్ని వ్యక్తం చేస్తున్నది. ఒక్కొక్క శబ్దమూ.. ‘అ’కార, ‘ఉ’కార, ‘మ’కార అర్థ సూత్రాలతో కూడిన ప్రణవ మంత్రమై ప్రతిధ్వనిస్తున్నది.
విజ్ఞానేశ్వరా! మహిమ అనేది భగవంతునికై మనం చేసే అన్వేషణలో ఉందో, మన భక్తిలో ఉంటుందో, మన జన్మజన్మల పాపపుణ్యాల ఫలితంగా ఉంటుందో.. మాకు తెలియదు. కానీ మేము, మావంటి
సాధారణ భక్తజనులు కోరుకొనేది ఒకటే! మాకు మంచి జరగాలి. మన చుట్టూ ఉన్నవారికి ఏ ఆపదలూ రాకుండా మంచి జరగాలి.. అనే”. ‘అవును’ అన్నట్టుగా తల పంకించాడు
విజ్ఞానేశ్వరుడు.