ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వినాయక చవితిని అందరూ ఎంతో భక్తి విశిష్టలతో జరుపుకుంటున్నారు. గణేశుడికి మంటపాలు కట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదక్ లు చేసి ఆయనకు ప్రసాదంగా సమర్పిస్తున్నారు. ఇక.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలు కాకుండా.. మట్టితో చేసిన వినాయకులనే ప్రతిష్ఠించాలని పర్యావరణ వేత్తలు చెబుతున్న నేపథ్యంలో.. చాలామంది పీవోపీ విగ్రహాలను కాకుండా మట్టివిగ్రహాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
అయితే.. కరోనా వల్ల చాలామంది ఎక్కువగా ఇంట్లోనే మంటపాలు ఏర్పాటు చేసుకొని ఇంట్లోనే వినాయక చవితిని జరుపుకుంటున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. గుంపులు గుంపులుగా మంటపాల వద్ద ఉండొద్దని ప్రభుత్వాలు సూచించడంతో.. ఎవరి ఇంట్లో వాళ్లే భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకుంటున్నారు.
ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ వినాయక చవితి సందర్భంగా 7000 సముద్రపు గవ్వలతో వినాయకుడిని తయారు చేశాడు. ఒడిశాలోని పూరీ బీచ్ లో సుదర్శన్ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశాడు.
మొదటి సారి 7000 గవ్వలను ఉపయోగించి బీచ్ లో వినాయకుడి విగ్రహాన్ని నిర్మించా. వరల్డ్ పీస్ అనే నినాదంతో దీన్ని నిర్మించా. ఇది ప్రపంచంలోనే మొదటి సముద్రపు గవ్వలు, ఇసుకను కలిపి తయారు చేసిన వినాయకుడి విగ్రహం అనుకుంట.. అని ఆయన ట్వీట్ చేశాడు.
వినాయక చవితి సందర్భంగా ఆయన వేసిన వినాయకుడి ఆర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అయితే సుదర్శన్ పట్నాయక్ టాలెంట్ కు ఫిదా అవుతున్నారు. ఆయన ఇలా ప్రతి అకేషన్ కు సాండ్ ఆర్ట్ వేస్తుంటాడు. కానీ.. ఈసారి మాత్రం కొత్తగా సముద్రపు గవ్వలతో ఆర్ట్ వేయడం నెటిజన్లకు తెగ నచ్చేసింది.