నీటి ఆదాలో ఈమెను మించిన వారు ఉండరేమో! మిషన్ భగీరథ కింద కావాల్సినన్ని నీళ్లు వస్తున్నప్పటికీ నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వాడుతున్న ఈమె తీరు అందరికీ ఆదర్శనీయమే!! ఆమె ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కొండపై ఉన్న తాండం గ్రామానికి చెందిన అనిత రాథోడ్.
ఒక తొట్టిలో చిన్నారికి స్నానం చేయిస్తున్న అనిత ఫొటో ఇటీవల ఒక పత్రికలో ప్రచురితమైంది. ఈ కథనాన్ని సీఎం ఓఎస్డీ, మిషన్ భగీరథ గ్రామీణ నీటి సరఫరా కార్యదర్శి స్మిత సభర్వాల్కు ట్వీట్ చేసిన వ్యక్తి తాండంలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన మిషన్ భగీరథ అధికారులు అనిత చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. వాళ్లకు అవసరాలకు సరిపోయే అన్ని నీళ్లు వస్తున్నాయని.. అయినప్పటికీ నీటిని వృథా చేయడం ఇష్టం లేక అలా నీటిని పొదుపు చేస్తున్నానని చెప్పింది. ఇదే విషయాన్ని స్మిత సభర్వాల్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. రేపటి తరాల కోసం నీటిని ఆదా చేస్తున్న అనిత ఎంతో ఆదర్శమని కొనియాడారు.