అహ్మదాబాద్, మే 29: గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ జైడస్ క్యాడిలా మరో ఘనతను సాధించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన జెనెరిక్ టాబ్లెట్లు అగ్రరాజ్యం అమెరికాలో వినియోగంలోకి రాబోతోన్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డిఏ) అనుమతి ఇచ్చింది. కొన్ని రకాల మానసిక వ్యాధితో బాధపడుతోన్న వారికి అందించే ట్రీట్మెంట్లో దీన్ని వినియోగించాల్సి ఉంటుంది.
స్కీజోఫ్రేనియా సహా కొన్ని రకాల మానసిక వ్యాధులు, డిప్రెషన్తో బాధపడుతోన్న వారికి అందించే చికిత్సలో భాగంగా తాము అభివృద్ధి చేసిన జెనెరిక్ టాబ్లెట్ల వినియోగానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి ఇచ్చినట్లు జైడస్ క్యాడిలా వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఫ్లూఫెనాజైన్ హైడ్రోక్లోరైడ్ రూపంలో ఈ టాబ్లెట్లను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. న్యూరోలెప్టిక్, ఫెనోథియాజైన్స్ ఆధారంగా దీన్ని రూపొందించినట్లు వెల్లడించింది. 1 ఎంజీ, 2.5 ఎంజీ, 5 ఎంజీ, 10 ఎంజీ స్ట్రెంగ్త్తో జెనెరిక్ వర్షన్తో ఈ టాబ్లెట్లను అభివృద్ధి చేసినట్లు జైడస్ క్యాడిలా యాజమాన్యం వివరించింది.