Mizoram | ఐజ్వాల్ : జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అధినేత లాల్దుహోమా మిజోరం ముఖ్యమంత్రిగా ఈ నెల 8వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. లాల్దుహోమా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గానూ 27 నియోజకవర్గాల్లో జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ గెలుపొంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక ఇవాళ రాత్రి 8 గంటలకు జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు.. లాల్దుహోమా నివాసంలో సమావేశం కానున్నారు.
74 ఏండ్ల వయసున్న లాల్దుహోమా.. ఐపీఎస్గా తన కెరీర్ను ప్రారంభించారు. పదవీ విరమణ అనంతరం ఆయన రాజకీయాల వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. గోవా, ఢిల్లీలో ఆయన ఐపీఎస్గా పని చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇంచార్జి ఆఫీసర్గా కూడా పని చేశారు లాల్దుహోమా. అదే సమయంలో రాజకీయాలకు ఆకర్షితుడైన లాల్దుహోమా తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. 1984లో లోక్సభకు ఎన్నికయ్యారు.