జైపూర్: వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తికి నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ అయ్యింది. దీంతో ఆ వ్యక్తి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో జొమాటో, మెక్డొనాల్డ్కు లక్ష జరిమానా విధించింది. (Zomato, McDonald fined) అలాగే ఆ వ్యక్తికి కోర్టు ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది. రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి తన కుటుంబం కోసం మెక్డొనాల్డ్లో వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేశాడు.
కాగా, జొమాటో ఏజెంట్ డెలివరీ చేసిన ఫుడ్ చూసి అతడు షాకయ్యాడు. వెజ్కు బదులు నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ చేయడంపై ఆ వ్యక్తి ఆగ్రహం చెందాడు. ఈ నేపథ్యంలో మెక్డొనాల్డ్, జొమాటోపై జోధ్పూర్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీంతో వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద ఉల్లంఘన జరిగినట్లు కోర్టు అభిప్రాయపడింది. మెక్డొనాల్డ్, జొమాటోకు లక్ష జరిమానా విధించింది. అలాగే రెండు సంస్థలు కూడా ఆ వ్యక్తికి కోర్టు ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది.
మరోవైపు, తమ సేవా నిబంధనల ప్రకారం ఫుడ్ డెలివరీ చేయడం మాత్రమే తమ పని అని జొమాటో తెలిపింది. ఆహార విక్రయానికి సంబంధించిన సేవలో ఏదైనా సమస్య, ఆర్డర్లో లోపం, ఆహార నాణ్యత, తప్పుడు డెలివరీకి సంబంధించి భాగస్వామి రెస్టారెంట్ బాధ్యత వహిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో జోధ్పూర్ జిల్లా వినియోగదారుల తీర్పుపై అపీల్ చేస్తామని జొమాటో వెల్లడించింది.