పీవీ చిన్నకూతురు డాక్టర్ విజయ సంతోషం
హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్ వాణీదేవి గెలుపుతో ఆమె కుటుంబ సభ్యు లు, బంధువులు సంబురాల్లో మునిగిపోయారు. ‘ఇవాళ తెల్లవారి లేవగానే (అమెరికాలో) శుభవార్త విన్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇది మా నాయిన(పీవీ)కు దక్కిన గౌరవం’ అని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిన్నకూతురు, వాణీదేవి సోదరి డాక్టర్ విజయ సంతోషం వెలిబుచ్చారు. తన సోదరి వాణీదేవి సామాజిక సేవకు గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తంచేశారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు చేసిన సంస్కరణల ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. చరమాంకంలో పీవీని విస్మరించి, అవమానించారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయంగా సొంతపార్టీ నేతలే తమ బాపును అవమానించినా, ఆయన ప్రవేశపెట్టిన పరిపాలనా పరమైన సంస్కరణల ఫలితాలను అనుభవిస్తున్న ఇప్పటి తరం గుర్తుంచుకుందని వ్యాఖ్యానించారు. అమెరికాలోనే ఉంటున్న వాణీదేవి కూతురు రజిత, అల్లుడు రాజేశ్ వద్దిరాజు, ఇతర బంధువులతో కలిసి సంబురాలు చేసుకొంటున్నామని విజయ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.