Sentinelese tribe : పురాతన సెంటినలీస్ తెగకు చెందిన వారికి కోక్ అందించిన యూట్యూబర్కు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసులో యూట్యూబర్కు పోర్ట్ బ్లెయిర్ కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో అతడు ఈ నెలలో కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రమాదకర తెగ సెంటినలీస్. ఇండియాకు చెందిన అండమాన్ దీవుల్లో 60,000 ఏళ్లుగా నివసిస్తున్నారు. ప్రపంచంలోని అనేక తెగలవాళ్లు ఇతర ప్రపంచంతో కలిసినా వారు మాత్రం అందరికీ దూరంగానే బతుకుతున్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవు. వారి దీవిలో మాత్రమే ఉంటారు.
గతంలో ఎలా ఉండేవారో ఇప్పటికీ అలాగే ఉంటారు. ఇతరులు ఎవరైనా అక్కడికి ప్రవేశించాలని చూస్తే వారిని అంతం చేస్తారు. అలా ఇటీవలి కాలంలో ఇద్దరిని చంపేశారు కూడా. దీంతో ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఉండదు. ఎవరైనా అలా వెళ్లేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. తాజాగా నియో ఓరియెంటలిస్ట్ అనే ఒక యూట్యూబ్ ట్రావెల్ ఛానెల్ నిర్వహించే మైఖైలో విక్టోరోవిచ్ పోల్యాకోవ్ అనే వ్యక్తి సెంటినలీస్ ఉండే దీవుల్లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఒక చిన్న పడవలో తొమ్మిది గంటలు ప్రవేశించి, అక్కడికి చేరుకుని ఐదు నిమిషాలు గడిపాడు. అక్కడి ఒక కొబ్బరి బోండాంలో డైట్ కోక్ ఉంచాడు. పైగా ఇదంతా అతడు వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశాడు. అక్కడివారు ఒకవేళ అది తాగితే ఈ తెగవారికి చాలా ప్రమాదం. ఎందుకంటే వారి ఆహారపు అలవాట్లు వేరు. మనం సాధారణంగా తీసుకునే ఆహారాన్ని వారు తీసుకోరు. అలాంటిది వారికి డైట్ కోక్ అందించడమంటే వారికి ప్రమాదాన్ని కల్పించినట్లే.
దీనివల్ల అంటువ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదంతా గత ఏడాది జరగగా అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఆ తెగకు హాని కలిగించేందుకు ప్రయత్నించాడనే కారణంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో అతడు పోర్ట్ బ్లెయిర్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, దీన్ని కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో అతడు ఈ నెల 29న కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. దీనిపై పూర్తి విచారణ పూర్తై, పోల్యాకోవ్ తప్పు చేశాడని తేలితే.. అతడికి ఐదేళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది.