న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్లను కేంద్రం ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఈ-పాస్పోర్ట్లు అంటే ఏమిటి. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. విమానాశ్రయాల్లో ఈ-పాస్పోర్టులతో ఇమ్మిగ్రేషన్, సెక్యూర్టీ చెక్స్ ఈజీ అవుతుంది. కంప్యూటర్ ద్వారా ఆథరైజేషన్ చాలా సులువుగా, భద్రతంగా ఉంటుంది. ఈ-పాస్పోర్టుల్లో చిప్లను అమర్చుతారు. ఆ చిప్లోనే ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. పాస్పోర్ట్ ఉన్న వ్యక్తికి సంబంధించిన అంశాలు డిజిటల్ రూపంలో ఉంటాయి. సంతకాన్ని కూడా ఆ చిప్లోనే స్టోర్ చేస్తారు. ఒకవేళ ఆ చిప్కు ఏదైనా ట్యాంపరింగ్ జరిగినా, అప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసే రీతిలో రూపొందిస్తున్నారు.
ఈ-పాస్పోర్ట్ ద్వారా బయోమెట్రిక్ డేటాను సెక్యూర్ చేయవచ్చు అని విదేశాంగశాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య తెలిపారు. అంతర్జాతీయ పౌర విమాన యాన సంస్థ ప్రమాణాలకు తగినట్లు ఈ-పాస్పోర్ట్ను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు ట్రయల్ పద్ధతిలో సుమారు 20 వేల అధికారుల పాస్పోర్ట్లకు చిప్లను అమర్చారు. ట్రయల్స్లో సక్సెస్ సాధించడం వల్ల ఇప్పుడు పౌరులకు కూడా ఆ ఈ-పాస్పోర్ట్లు ఇవ్వనున్నారు.
ఈ-పాస్పోర్ట్లు ఎలా పనిచేస్తాయి..
ఈ-పాస్పోర్ట్ లేదా డిజిటల్ పాస్పోర్ట్.. సాంప్రదాయ పాస్పోర్ట్లాగే ఉంటుంది. అయితే ఎలక్ట్రానిక్ చిప్లోనే ప్రింట్ సమాచారం నిక్షిప్తం అయి ఉంటుంది. మైక్రోచిప్లో పాస్పోర్ట్ కలిగిన వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు డిజిటల్ రూపంలో ఉంటాయి. పాస్పోర్ట్ వెనుక భాగంలో చిప్ను అమర్చుతారు. అది 64 కిలోబైట్ల సామర్థ్యం కలిగి ఉంది. ఆ చిప్లో గడిచిన 30 అంతర్జాతీయ ప్రయాణాల సమాచారం ఉంటుంది. పాస్పోర్ట్ కలిగిన వ్యక్తి ఫోటోతో పాటు వేలిముద్రల్లాంటి బయోమెట్రిక్ డేటా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చిప్ను ధ్వంసం చేస్తే, అప్పుడు ఆ పాస్పోర్ట్ పనిచేయదు.
ఈ-పాస్పోర్ట్తో ఇమ్మిగ్రేషన్ క్యూలైన్ ముందు ఎక్కువ సేపు నిలుచునే అవకాశం ఉండదు. ఈ-పాస్పోర్ట్తో కొన్ని క్షణాల్లోనే స్కానింగ్ పూర్తి అవుతుంది. ఫిజికల్ వెరిఫికేషన్లో ఎక్కువ సమయం తీసుకుంటుంది. నకిలీ పాస్పార్ట్ వ్యాపారాన్ని కూడా దీని ద్వారా అంతం చేయవద్చు. మైక్రోచిప్లో డేటాను మార్చడం వీలుకాదు కాబట్టి, నకిలీ పాస్పోర్ట్ గోల తగ్గే అవకాశం ఉంది.
చిన్ ఆధారిత పాస్పోర్ట్లను తయారు చేసే కాంట్రాక్ట్ను నాసిక్కు చెందిన ఇండియా సెక్యూర్టీ ప్రెస్ దక్కించుకున్నది. ప్రొక్యూర్మెంట్ పూర్తి అయిన వెంటనే ఈ-పాస్పోర్ట్లను జారీ చేస్తారు. టీసీఎస్ కూడా ఈ-పాస్పోర్ట్లను జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.