అహ్మదాబాద్: విదేశాల్లో మరణించిన యువకుడి మృతదేహం ఎయిర్పోర్ట్కు చేరుకుంది. అయిదే దానిని విడి భాగాల సామాగ్రిగా భావించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది సంబంధిత సంస్థకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబం అక్కడకు వెళ్లి ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. (Man’s Corpse Handed Over As Spare Parts) గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది. గుజరాత్లోని సురేంద్రనగర్కు చెందిన జీల్ ఖోఖ్రా గత ఏడాది మే నుంచి ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. మెల్బోర్న్లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. మార్చి 17న విక్టోరియా బీచ్లో ఈత కొడుతూ అస్వస్థతకు గురై మరణించాడు. ఈ విషయం తెలిసి గుజరాత్లోని అతడి కుటుంబం తల్లడిల్లిపోయింది.
కాగా, మార్చ్ 27న ఎయిర్ ఇండియా కార్గో విమానంలో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి జీల్ ఖోఖ్రా మృతదేహం చేరుకుంది. అతడి కుటుంబం ఎయిర్పోర్ట్లో ఎదురుచూస్తున్నది. అయితే ఎయిర్పోర్ట్ సిబ్బంది జీల్ మృతదేహాం ప్యాక్ను స్పేర్పార్ట్స్ పార్సిల్గా పొరపాటుపడ్డారు. మిగతా సామాగ్రితోపాటు మృతదేహం ఉన్న ప్యాక్ను ఒక వాహనంలోకి ఎక్కించారు. ముంబై సంస్థకు చెందిన అహ్మదాబాద్ కార్యాలయానికి పంపారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న జీల్ కుటుంబం ఆ కార్యాలయానికి వెళ్లింది. జీల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ నిర్లక్ష్యంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసింది. జీల్ మృతదేహాన్ని ధృవీకరించడంలో విఫలమైన ఎయిర్పోర్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.