జైపూర్: మరొకరితో పెళ్లి కుదర్చడాన్ని సహించలేని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది (Couple ends life). చనిపోయే ముందు తమ ఫొటోలను చివరిసారి వాట్సాప్లో పోస్ట్ చేశారు. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధోరిమన పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగ్తా గ్రామానికి చెందిన 21 ఏళ్ల ఓం ప్రకాష్, 19 ఏళ్ల ఖుషి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు.
కాగా, యువతి కుటుంబ సభ్యులు ఇటీవల మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈ నేపథ్యంలో ఆ ప్రేమ జంట దారుణ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి ఓం ప్రకాష్, ఖుషి తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లారు. గ్రామ శివారులో ఉన్న స్కూల్లో కలుసుకున్నారు. చివరిసారి మొబైల్లో ఫొటోలు తీసుకున్నారు. వాట్సాప్లో వాటిని పోస్ట్ చేశారు. అనంతరం స్కూల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మరోవైపు స్థానికుల నుంచి ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రేమ జంట మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి పెద్దలు మరొకరితో పెళ్లి సంబంధం కుదర్చడంతో ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.