ముంబై: మహారాష్ట్రలోని అధికార శివసేనకు చెందిన సీనియర్ నేత సంజయ్ రౌత్, కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై శనివారం మండిపడ్డారు. శివసేన జాతకం తన వద్ద ఉందని ఆయన బెదిరిస్తున్నారని విమర్శించారు. అయితే ఇలాంటి బెదిరింపులను తాము లెక్కచేయమని అన్నారు. నారాయణ్ రాణే జాతకం కూడా తమ వద్ద ఉందన్నారు. ‘మీరు కేంద్ర మంత్రి కావచ్చు. కానీ ఇది మహారాష్ట్ర. ఇది మర్చిపోవద్దు. మేము మీ ‘బాప్’. అంటే మీకు బాగా తెలుసు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కాగా, బీజేపీ బెదిరింపులకు తాము భయపడబోమని సంజయ్ రౌత్ అన్నారు. తమ కుంభకోణానికి సంబంధించిన పత్రాలను కేంద్ర సంస్థలకు ఇవ్వాలని బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్యకు సవాల్ విసిరారు. తాము కూడా ఆయనకు సంబంధించిన కుంభకోణాన్ని బయటపెడతామని అన్నారు. సోమయ్యకు సంబంధించిన రూ.260 కోట్ల విలువైన ప్రాజెక్ట్ పనులు పాల్ఘడ్లో జరుగుతున్నాయని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ ఆయన కుమారుడి పేరు మీద ఉందని, ఆయన భార్య డైరెక్టర్గా ఉన్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ చేపట్టే అంత డబ్బు సోమయ్యకు ఎలా వచ్చిందో దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలో కొనసాగుతున్న క్రిమినల్ సిండికేట్ను అంతం చేస్తామని సంజయ్ రౌత్ హెచ్చరించారు. ప్రతి రోజూ ఒక్కో కుంభకోణాన్ని బయటపెడతామని తెలిపారు. దానికి సంబంధించిన సమాచారాన్ని మీడియా ముందు ఉంచుతామని చెప్పారు. ముంబైలో ప్రారంభమైన దోపిడీ వ్యవస్థను బహిర్గతం చేయడానికి తాము వెనుకాడబోమన్నారు.