పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి తాను మద్దతిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకున్నానని మాజీ సీఎం, హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) తెలిపారు. తన సహకారం లేకపోతే నితీశ్ కుమార్ ప్రభుత్వం పడిపోయి ఉండేదని అన్నారు. శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాంఝీ, గతంలో నితీశ్ కుమార్ తనను ముఖ్యమంత్రి చేశారని చెప్పారు. ఎన్డీయేలో చేరి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ప్రభుత్వానికి అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా 122 ఓట్లు మెజార్టీ కావాల్సి ఉందన్నారు.
కాగా, తమ పార్టీ నాలుగు సీట్ల మద్దతుతో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి 125 ఓట్లు లభించాలని జితన్ రామ్ మాంఝీ తెలిపారు. తమ నాలుగు సీట్ల మద్దతు లేకపోతే 121 సంఖ్యతో నితీశ్ కుమార్ ప్రభుత్వం కూలిపోయేదని చెప్పారు. ‘ఆయన (నితీశ్ కుమార్) నన్ను ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు నేను ఆ రుణం తీర్చుకున్నానని చెబుతున్నా’ అని అన్నారు. అలాగే ఎన్డీయేలో చేరడం ద్వారా నితీశ్ కుమార్ సరైన నిర్ణయం తీసుకున్నారని మాంఝీ తెలిపారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలుకు తాను కృషి చేస్తానని చెప్పారు.