న్యూఢిల్లీ: నేషనల్ వార్ మెమోరియల్లో కలపడం పేరుతో అమర్ జవాన్ జ్యోతిని ఆర్పివేయడం తగదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ విమర్శించారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని నేషనల్ వార్ మెమోరియల్ జ్యోతితో విలీనం చేసిన కేంద్ర ప్రభుత్వం చర్యను ఆయన తప్పుపట్టారు. జ్వాల అంటే అమర్ అని అర్థమని, అది అమరత్వం, శాశ్వతమైనదని అన్నారు. మీ ఇష్టానికి అనుగుణంగా శాశ్వతమైన వాటిని నాశనం చేయడం తగదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
కాగా, దేశంలో నేతాజీ పేరుతో 164 సంస్థలు ఉన్నాయని శశి థరూర్ తెలిపారు. ఇవన్నీ కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో లేని 2014కి ముందుగానే ఉన్నాయని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుభాష్ చంద్రబోస్ గుర్తుగా చేసిందేమీ లేదని విమర్శించారు. నేతాజీని కేవలం చిహ్నంగానో, హోలోగ్రామ్కో పరిమితం చేయకూడదని అన్నారు. కొన్ని ప్రశంసనీయమైన విలువలు, సూత్రాల కోసం నేతాజీ నిలిచారని గుర్తుచేశారు. ఆయన శౌర్యం, పరాక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం వదిలేసిందని ఆరోపించారు.