UGC | న్యూఢిల్లీ, డిసెంబర్ 5 : ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు యూజీసీ శ్రీకారం చుడుతున్నది. యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాలు, వ్యవధి, అర్హతలకు సంబంధించి అనేక సంస్కరణలను ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలతో ముసాయిదాను గురువారం ప్రకటించింది. కొత్త నిబంధనలు చాలావరకు విదేశీ వర్సిటీల విద్యా విధానాలను పోలి ఉన్నాయి. ముందు చదివిన కోర్సుతో సంబంధం లేకుండా నచ్చిన కోర్సును డిగ్రీ, పీజీలో ఎంచుకునే వీలు కల్పించింది. పలు దేశాల్లో అనుసరిస్తున్న ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు, ఏకకాలంలో రెండు కోర్సులు చదివే అవకాశం వంటి వాటిని ఈ ముసాయిదాలో పొందుపరిచారు. విద్యార్థులకు తరగతి గది అంశాలతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. ఈ సంస్కరణల ద్వారా దేశ ఉన్నత విద్యా వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలను చేరుకునేలా చేస్తామని యూజీసీ చైర్పర్సన్ జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. మూలాలను అంటి పెట్టుకొని ఉంటూనే, విద్యార్థుల విభిన్నమైన అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఇక నుంచి వివిధ కోర్సుల్లో ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు నిర్వహించాలని భారత్లోని ఆరు సెంట్రల్ యూనివర్సిటీలు నిర్ణయించాయి. ఉన్నత విద్యా సంస్థల్లో చేరికకు విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు నిర్వహించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించడంతో కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తేజ్పూర్ యూనివర్సిటీ, నాగాలాండ్ యూనివర్సిటీలు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ అడ్మిషన్లు ప్రతి ఏడాది జూలై/ఆగస్టు, జనవరి/ఫిబ్రవరిలో జరుగుతాయి. .