లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ కంటే గొప్ప హిందువు కావాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీ పడుతున్నారని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. యోగి లేదా అఖిలేష్ మధ్య ఎవరు గొప్ప హిందువు అనే దానిపై పోరు సాగుతోందని ఆయన విమర్శించారు. సామాజిక న్యాయం గురించి కాకుండా, ఒకరు గుడి గురించి మాట్లాడితే మరొకరు మరో గుడి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ గురించి లక్నోలో మీడియాతో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకుగాను భాగీదారీ సంకల్ప్ మోర్చా కింద సుమారు 100 సీట్లలో తాము పోటీ చేస్తామని తెలిపారు. ఈ కూటమిలోని అన్ని పార్టీలు బాబు సింగ్ కుష్వాహా కన్వీనర్గా ఉండాలని నిర్ణయించాయని చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి గెలిస్తే మొదటి రెండున్నర సంవత్సరాలు ఆయన సీఎంగా ఉంటారని, మిగిలిన రెండున్నర సంవత్సరాలు దళిత వ్యక్తి సీఎం అవుతారని అన్నారు. ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉంటారని, ముస్లిం సమాజం నుంచి ఒకరు, వెనుకబడిన వర్గాల నుంచి ఇద్దరిని ఎంపిక చేస్తామన్నారు.