న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు (women’s reservation bill) ను రాజ్యసభలో గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రియన్ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2010లో ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు నాడు ఎంపీగా ఉన్న యోగి ఆదిత్య నాథ్ దీని గురించి మాట్లాడారు. ‘ఈ బిల్లు అమలులోకి వస్తే భారత రాజకీయ వ్యవస్థను ముంచెత్తుతుంది. పురుషులు స్త్రీ లక్షణాలను పెంపొందించుకుంటే వారు దేవుళ్లు అవుతారు. కానీ స్త్రీలు పురుష లక్షణాలను పెంపొందించుకుంటే వారు రాక్షసులుగా మారతారు. స్త్రీ విముక్తికి సంబంధించిన పాశ్చాత్య ఆలోచనలను భారతీయ విధానంలో సరిగ్గా విశ్లేషించాలి’ అని అన్నారు.
కాగా, 2010లో యోగి ఆదిత్యనాథ్ చేసిన ఈ వ్యాఖ్యలను టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ తాజాగా రాజ్యసభలో గుర్తుచేశారు. అలాగే బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై మహిళా రెజర్లు చేసిన లైంగిక వేధింపు ఆరోపణలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లు, మహిళా సాధికారత పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిజంగా శ్రద్ధ చూపుతున్నదా? అని ప్రశ్నించారు. మరోవైపు సుమారు 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో మంగళవారం ఆమోదం పొందింది. కొత్త పార్లమెంట్ భవనంలో ఆమోదం పొందిన తొలి బిల్లుగా చరిత్రకెక్కింది.