లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నేతృత్వం వహించి పార్టీని గెలిపించిన యోగి ఆదిత్యనాథ్ ఈ నెల 25న రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లక్నోలోని ఏక్తా క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నేతలు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు ఆర్ఎస్ఎస్ నేతలు యోగి ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని తెలుస్తున్నది.
ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురు మాజీ సీఎంలను ఆహ్వానించనున్నట్లు సమాచారం. బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి, యూపీ కాంగ్రెస్ ఇంచార్జీ ప్రియాంక గాంధీని కూడా యోగి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించవచ్చని సమాచారం. యోగి తొలి ప్రభుత్వంలో పలు పథకాల ద్వారా లబ్ధిపొందిన కొందరు మహిళలు కూడా ఈ కార్యక్రమానికి తరలిరానున్నట్లు తెలుస్తున్నది.
ఉత్తరప్రదేశ్లోని 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 10న జరిగిన కౌంటింగ్లో 255 స్థానాల్లో బీజేపీ, 18 స్థానాల్లో మిత్రపక్షాలు గెలిచాయి. దీంతో 273 సీట్ల మెజార్టీతో యూపీలో మరోసారి అధికారాన్ని బీజేపీ చేపట్టనున్నది. గట్టి పోటీ ఇచ్చిన అఖిలేష్ యాదవ్కు చెందిన ఎస్పీ 111 సీట్లు, దాని మిత్రపక్షాలు 14 సీట్లు గెలిచాయి. కాగా, తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన యోగి ఆదిత్యనాథ్ రెండోసారి సీఎం పదవిని చేపట్టి మరో రికార్డు సృష్టించనున్నారు.