లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు. 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అలాగే ఎమ్మెల్యేగా సీఎం పదవిని రెండోసారి చేపట్టనున్నారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయ్యారు. అప్పటికే ఆయన ఐదుసార్లు గోరఖ్పూర్ ఎంపీగా గెలిచారు. సీఎం అయ్యాక ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గతంలో యూపీ ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఎమ్మెల్సీగానే సీఎం పదవిని చేపట్టారు.
కాగా, ఈసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అయితే సీఎం కావాలన్న అఖిలేష్ యాదవ్ కలలు ఆవిరయ్యాయి. ఈసారి కూడా బీజేపీ పూర్తి మెజార్టీ సాధించింది. సీఎం అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ను బీజేపీ అధిష్ఠానం ప్రకటించలేదు. అయితే యూపీలో బీజేపీ విజయానికి సారథ్యం వహించిన ఆయనే రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టవచ్చని తెలుస్తుంది. దీంతో తనకు పట్టున్న గోరఖ్పూర్ (అర్బన్) నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్ ఆ హోదాలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి మరో రికార్డు సృష్టించనున్నారు.