ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. యూపీ గవర్నర్ ఆనందీబెన్ పాటిల్ యోగితో ప్రమాణ స్వీకారం చేయించారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పాయ్ ఏకనా స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. యోగి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత… డిప్యూటీ సీఎంలుగా కేశవ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరి తర్వాత 53 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, గడ్కరీ, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్తో సహా బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
యోగి కేబినెట్లోకి ఏకే శర్మ..
ఏకే శర్మ… మాజీ ఐఏఎస్ అధికారి. మోదీకి అత్యంత సన్నిహితుడు. పీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆయన యూపీ బీజేపీ ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు. సీఎం యోగికి, ఈయనకు మధ్య సత్సంబంధాలు లేవని వార్తలొచ్చాయి. చివరికి ఈయన యోగి కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించిన స్వతంత్ర దేవ్ సింగ్ను ఈ సారి కేబినెట్లోకి తీసుకొని, ప్రమోషన్ కల్పించారు.
ఇద్దరేసి చొప్పున ప్రమాణం…
కేబినెట్ మంత్రులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 18 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సహాయ మంత్రుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇద్దరేసి చొప్పున ప్రమాణ స్వీకారం చేశారు.
కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేసిన జితిన్ ప్రసాద
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన యువనేత జితిన్ ప్రసాద కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం తర్వాత సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి యోగికి, ప్రధాని మోదీకి అభివాదం చేశారు. జితిన్ ప్రసాద బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అత్యంత కీలకమైన నేత. చాలా కాలం కాంగ్రెస్లో వున్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. అయితే.. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ను వీడిన కొద్ది రోజులకే జితిన్ ప్రసాద కూడా కాంగ్రెస్ను వీడి, బీజేపీలో చేరారు.