లక్నో: ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు అధికార బీజేపీని మంత్రులు, ఎమ్మెల్యేలు వీడుతుండగా, మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. గోరఖ్పూర్లోని ఓ దళితుడి ఇంట్లో శుక్రవారం ఆయన భోజనం చేశారు. అమృత్ లాల్ భారతీ ఇచ్చిన అతిథ్యాన్ని సీఎం యోగి స్వీకరించారు. ‘సామాజిక సామరస్యం లక్ష్యం నిరంతరం పెరుగడమే. ఈరోజు గోరఖ్పూర్లోని జుంగియాకు చెందిన అమృత్ లాల్ భారతీజీ ఇంట్లో ఖిచ్డీ, ప్రసాదాన్ని స్వీకరించే అదృష్టం నాకు కలిగింది. చాలా ధన్యవాదాలు భారతీజీ!’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అమృత్ లాల్ భారతీతో కలిసి సీఎం యోగి ఆదిథ్యనాథ్ భోజనం చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు.
అనంతరం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్పై సీఎం యోగి మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేవలం 18,000 ఇళ్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. బీజేపీ 45 లక్షల ఇళ్లు ఇచ్చిందని తెలిపారు. వంశపారంపర్య రాజకీయాల పట్టులో ఉన్నవారు సమాజంలోని ఏ వర్గానికీ న్యాయం చేయలేరని మండిపడ్డారు. సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం దళితులు, పేదల హక్కులపై దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.