బెంగళూరు: దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తున్నది. వైరస్ భయాలతో ఎంతోమంది శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. అలాంటివారి మానసిక, శారీరక ఆరోగ్యానికి తోడ్పాటునందించడానికి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఎన్జీవో మూడు ప్రత్యేకమైన యోగాసనాల విధానాలను ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా సోకనివారిలో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, రోగనిరోధకశక్తిని పెంపొందించడం.. తేలికపాటి కొవిడ్-19 లక్షణాలు ఉన్నవారు త్వరగా అనారోగ్యం నుంచి బయటపడేందుకు ప్రాణాయామాలు, ఆసనాలు.. కొవిడ్-19 వచ్చి తగ్గిన వారికి తిరిగి అరోగ్యమంతమైన జీవితం కోసం ప్రత్యేకమైన ప్రాణాయామం, యోగా ప్రక్రియలను తీసుకొచ్చింది. కొవిడ్-19 భయాలు, ఒంటరితనం వల్ల కలిగే ఆందోళనను తగ్గించేందుకు ఈ పద్ధతులు ఎంతగానో ఉపయోగపడుతాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
కరోనా సోకినవారిలో 5-7 శాతం మందికి మాత్రమే దవాఖానకు వెళ్లే అవసరం ఉంటుందని, ఇంటివద్ద ఉంటూనే ప్రాణాయామం, శ్వాస పద్ధతులను పాటించడం, రోగనిరోధక శక్తిని పెంచే ‘కబాసుర కుడినీర్’ వంటి ఆయుర్వేధ ఔషధాలను తీసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.
ఊపిరి మరింత మెరుగ్గా..
కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా ‘కబాసుర కుడినీర్’ 84 శాతం సమర్థంగా నిరోధిస్తున్నదని జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ బయోటెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ పరిశోధనల్లో తేలిందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రాణాయామాలు-ఆర్ట్ ఆఫ్ లివింగ్ మూడంచెల ప్రాణాయామం, ఉజ్జయీ ప్రాణాయామం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయని కాలిఫోర్నియాలోని లోమా లిండా విశ్వవిద్యాలయంలోని వైద్యకళాశాల చేపట్టిన ఓ పరిశోధనలో తేలిందన్నారు. రోజూ ఇరవై నిమిషాల పాటు యోగా, ధ్యానం చేస్తే శరీరానికి ఒత్తిడి కలిగించే కార్టిజాల్ స్థాయిని బాగా తగ్గించవచ్చన్నారు. వచ్చే రెండు నెలల్లో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించనున్నట్టు చెప్పారు.