– పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్
రామగిరి, మార్చి 31: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే పీఆర్సీ, డీఏలను తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా కులగణన రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, కంటి తూడుపుగా గత సంవత్సర ఎస్ఎస్సీ స్పాట్ వాల్యూయేషన్ డబ్బులు విడుదల చేస్తున్నారని, అలా కాకుండా పూర్తి స్థాయిలో అందజేయాలని లేని పక్షంలో పదో తరగతి స్పాట్ బహిష్కరిస్తామని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ అన్నారు. నల్లగొండతో పాటు పలు ప్రాంతాలోని పాఠశాలలో ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ సన్మానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంగళవారం రాత్రి వరకు పీఆర్సీ, డీఏ, ఉపాధ్యాయులకు, పెన్షనర్స్కు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. కుల గణన చేసిన సర్వే రెమ్యూనరేషన్స్ సహితం ఇంతవరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నేటికి అమలు చేయకపోవడంతో తీవ్ర మనోవేదనలో ఉన్నారన్నారు. ఆయా కార్యక్రమాల్లో పీఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు డివిఎస్ ఫణికుమార్, నల్లగొండ ఎంఈఓ కత్తుల అరుందతి, పీఆర్టీయూ నల్లగొండ మండల అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల భాస్కర్ గౌడ్, బొడ్డు నాగయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.