Sanjeev Sanyal | న్యూఢిల్లీ, మార్చి 27: ఐఏఎస్, ఇతర సివిల్ సర్వీస్ పరీక్షల కోసం లక్షలాది మంది విద్యార్థులు 5 నుంచి 8 ఏండ్ల పాటు కష్టపడటం యువశక్తిని వృథా చేయడమేనని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. సివిల్ సర్వీసుల్లో ఉద్యోగం చేయాలనుకునే వారు యూపీఎస్సీ కానీ, సంబంధిత ఏ పరీక్ష కానీ ఒక్కసారి మాత్రమే ప్రయత్నించాలన్నారు.
కానీ మన దేశంలో వచ్చిన సమస్య ఏంటంటే లక్షలాది మంది యువత ఏండ్ల తరబడి సిద్ధమవుతూ అదే తమ జీవన విధానంగా మార్చుకుంటున్నారన్నారు. దీని కారణంగా యువశక్తి ఎంతో వృథా అవుతున్నదని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లో దీనికే వెళ్లాలనుకునే వారికి రెండు ప్రయత్నాలు వరకు సబబేనని, అయితే మీ 20 ఏండ్ల ప్రాయాన్ని అంతా దీనికే వృథా చేయవద్దని ఆయన సూచించారు.
ఒక్క ఏడాదిలో సివిల్స్ సాధ్యం కాదు
సంజీవ్ సన్యాల్ చేసిన వ్యాఖ్యలను పలువురు మాజీ బ్యూరోక్రాట్లు కొట్టివేశారు. గుజరాత్ కేడర్కు చెందిన 1962 బ్యాచ్ మాజీ ఐఏఎస్ అధికారి సుందరం మాట్లాడుతూ సంజీవ్ సూచనను పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. లక్షలాది మంది పోటీ పడే సివిల్స్ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం అంత సులభమేమీ కాదని అన్నారు. మరో మాజీ ఐఏఎస్ అధికారి ఎస్కే సర్కార్ మాట్లాడుతూ ఈ పరీక్షకు సన్నద్ధులవ్వడం కారణంగా యువశక్తి కానీ, వనరులు కానీ వృథా కావని, వారిలో తెలివితేటలు విస్తృతమవుతాయని స్పష్టం చేశారు.