టీఆర్ఎస్ తరఫున ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలతో పాటు టీఆర్ఎస్ బృందం కూడా హాజరుకానున్నది. ఇందుకోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఆదివారమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ఆయనతో పాటు టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్ రెడ్డి, సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వీరంతా ఢిల్లీలో జరిగే యశ్వంత్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.