న్యూఢిల్లీ, జూన్ 27: విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సమయంలో ఆయన వెంట టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కే తారకరామారావు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్పవార్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, టీఎంసీ, డీఎంకే నేతలతో సహా 15 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు. ఈ పోటీ ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని, రెండు సిద్ధాంతాల మధ్య అని యశ్వంత్ పేర్కొన్నారు. యశ్వంత్కు మద్దతు పలుకుతున్నట్టు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం ప్రకటించారు. పార్లమెంట్ ప్రాంగణంలో యశ్వంత్ నామినేషన్ దాఖలు కన్నా ముందు మంత్రి కేటీఆర్ ఆయనతో భేటీ అయ్యారు.
దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, బీజేపీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బీజేపీ వ్యతిరేక శక్తులను కూటగట్టేందుకు రూపొందించే కార్యాచరణపై సమాలోచనలు జరిపారు. మంత్రి కేటీఆర్ వెంట టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు పోతుగంటి రాములు, గడ్డం రంజిత్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్నేత, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి తదితరులు ఉన్నారు. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి సిన్హా ఎన్నికల ప్రచార కమిటీలో ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
పాత మిత్రులను మద్దతు కోరాను
మోదీ, రాజ్నాథ్తో సహా బీజేపీలోని తన పాత మిత్రులను సంప్రదించి రాష్ట్రపతి ఎన్నికల్లో వారి మద్దతు కోరానని యశ్వంత్ సిన్హా తెలిపారు. నామినేషన్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీ హాయాంలో బీజేపీలో ప్రస్తుతం అంతర్గత ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్మూ పేరును ప్రస్తావించిన సిన్హా.. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి మోదీ సర్కారు ఏం చేసిందని ప్రశ్నించారు.
యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పూర్తి మద్దతు:మంత్రి కేటీఆర్ ట్వీట్
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు పూర్తిస్థాయి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.