న్యూఢిల్లీ : భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆమె ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆమెకు చైనా, శ్రీలంక అధ్యక్షులు జిన్పింగ్, రణిల్ విక్రమసింఘే అభినందనలు తెలిపారు. భారత్ – చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు అభినందలు తెలుపడం గమనార్హం. జిన్పింగ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ ద్వారా అభినందనలు తెలిపారు. భారత్ – చైనా ముఖ్యమైన పొరుగు దేశాలని జిన్పింగ్ పేర్కొన్నారు. ఇరుదేశాల సంబంధాలు స్థిరంగా, సుహృద్భావంగా ఉండాలని, మన బంధం.. ప్రజల ప్రాథమిక ప్రయోజనాలకు దోహదం కావాలన్నారు.
ఇరుదేశాల బంధం, శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి తోడ్పడాలన్నారు. పరస్పర విశ్వాసం, ఆచరణాత్మక సహకారం పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ముర్ముతో కలిసి పని చేసేందుకు సిద్ధమన్నారు. అలాగే శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే సైతం ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపారు. ‘మీ నియామకం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంపై విశ్వాసం, విశ్వాసానికి అతిపెద్ద నిదర్శనమన్నారు. సత్సంబంధాలను పెంపొందించేందుకు, బలోపేతం చేయడానికి ఉమ్మడి ప్రయత్నాలకు మీ నాయకత్వం కొత్త ప్రేరణ ఇస్తుందని, ఈ దిశలో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు విక్రమసింఘే పేర్కొన్నారు.