XBB 1.16 Variant | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు 76 నమూనాల్లో XBB 1.16 వేరియంట్ను గుర్తించారు. ఇటీవల కొవిడ్ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణంగా భావిస్తున్నారు. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) డేటాలో పేర్కొంది. ఇన్సాకాగ్ (INSACOG) కొవిడ్-19 జన్యు శ్రేణిని, వైరస్ వేరియంట్స్ను అధ్యయనం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కింద 2020లో ఏర్పాటు చేశారు.
ఎక్స్బీబీ 1.16 వేరియంట్ కేసులో మహారాష్ట్రలో 29, పుదుచ్చేరిలో 7, ఢిల్లీలో 5, తెలంగాణలో 2, గుజరాత్లో ఒకటి, హిమాచల్ ప్రదేశ్లో ఒకటి, ఒడిశాలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. XBB 1.16 వేరియంట్ తొలిసారిగా జనవరిలో గుర్తించారు. ఫిబ్రవరిలో 59 నమూనాల్లో ఈ వేరియంట్ను గుర్తించారు. మార్చిలో ఇప్పటి వరకు XBB 1.16 వేరియంట్కు 15 నమూనాలు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంట్ కారణమని నిపుణులు భావిస్తున్నారు.
అయితే, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ కేసుల పెరుగుదులకు XBB 1.16 వేరియంట్ కారణంగా కనిపిస్తోందన్నారు. అదే సమయంలో ఇన్ఫ్లుయెంజా కేసులకు H3N2 వైరస్ కారణమని తెలిపారు. అయితే, కొవిడ్ నియమాలను అనుసరిస్తే.. వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చన్నారు. కేసులు సీరియస్గా లేవని, అందుకే ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు. కొత్త వేరియంట్ కేసులు దాదాపు 12 దేశాల్లో నమోదయ్యాయి. అమెరికా, బ్రూనై, సింగపూర్, యూకే తదితర దేశాల్లోనూ కేసులు నమోదయ్యాయి.
గత 14 రోజుల్లో భారత్లో కేసులు 281 శాతం, మరణాలు 17 శాతం పెరిగాయని పీడియాట్రిక్స్ మాజీ కోఆర్డినేటర్ విపిన్ ఎం వశిష్ఠ పేర్కొన్నారు. XBB 1.16 వేరియంట్ భారతీయుల జనాభా ప్రభావం చూపితే.. ప్రపంచం మొత్తం ఆందోళనకర పరిస్థితులు ఉంటాయన్నారు. ఇదిలా ఉండగా.. 126 రోజుల తర్వాత దేశంలో భారీ కొవిడ్ కేసులు పెరిగాయి. శనివారం దేశంలో 840కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 5,389కి చేరింది.